సుందరం ఓసారి ఇలారా, అమ్మ పిలిచింది
ఎందుకలా గావుకేకలు, ఏమి కొంపములిగింది, వెళ్లేను.
ములగడానికి మనకి కొంపలేవీ లేవుగాని ఓసారి అటు చూడు. చూసేను.
మథెర్స్ డే అంటే ఏవిటే అడిగింది.
తల్లి తద్దినం.
ఏంమాటలే!
ఔనమ్మా నువ్వు అడిగినదానికి తెలుగు.
చూడు, మాతృదేవోభవ అన్నాయి శాస్త్రాలు.
అమ్మ అన్నది ఒక కమ్మని మాట అన్నాడు ఓసినీ కవి.
అనడానికి రాయడానికి ఎన్నైనా అనొచ్చు.
ఎంతమంది అమ్మని అభిమానంగా చూస్తున్నారు?
అదిగో టివిలో చెప్తోంది.
ఆవిడ నాకు తెలుసు.
చిన్న కూతురికి పెట్టేస్తోందని తల్లిని సతాయిస్తుంది
అసలు ఇవన్నీ మనం దిగుమతి చేసుకున్నాం.
మిగిలిన దేశాల్లో పిల్లలు మనలాగా పాతికేళ్ళదాక అమ్మ నాన్నల మీద బతకరు.
అందుకే ఈ డేలు.
ఇవన్నీ కేవలం ప్రోపగాండాలు.
పొనీలేవే ఎందుకంత ఆవేశం, మంచివాళ్ళు లేరంటావా.
ఎందుకులేరు గంజాయివనంలో తులసిమొక్కలా అక్కడక్కడ ఉన్నారు. లేకపోతే ఈప్రపంచం ఎప్పుడో అంతం అయిపోయేది.
తల్లి అంటే పుట్టినప్పటినుంచి చాకిరీ చేసే పనిమనిషి అంతే.
పిల్లలపట్ల మనకి బాధ్యతలే కానీ హక్కులు లేవు.
పిల్లలకి మనపట్ల హక్కులే కానీ బాధ్యతలు లేవు.
ఏవుంది ఎప్పుడు ఏడుపే.
కొడుకులకి పెట్టేస్తోందని కూతుళ్లు ఏడుపు.
కూతుళ్ళకి పెట్టేస్తోందని కోడళ్ల ఏడుపు.
మొత్తానికి అందరూ ఆవిడమీద పడి ఏడిచేవాళ్లే
పైకి మాత్రం మాఅమ్మ మాకు ఇన్స్పిరేషన్ అని కబుర్లు.
ఎందుకమ్మా ఇలాటి ప్రోగ్రాములు చూస్తావు?
అంత ఆవేశం ఎందుకే అందర్నీ ఆ భగవంతుడే చూస్తాడు, అంది వేదాంతికంగా
అయితే వాడినే నమ్ముకో అని టక్కున టీవీ కట్టేసేను.
ఏవిటో నీదంతా వితండవాదం అంటూ పడుకుంది.
-బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ