సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఘన విజయం వేపు నడిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 17వ లోక్సభ ప్రారంభం సందర్భంగా సోమవారం నాడు తన ఉదారతను చాటుకునే మాటలు మాట్లాడారు. సంఖ్య ముఖ్యం కాదనీ, ప్రతిపక్షం చెప్పే ప్రతిమాటా ముఖ్యమేననీ ఆయన అన్నారు. మొన్నటి ఎన్నికలలో బిజెపికి సొంతబలం మీదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల విధంగా 303 సీట్లు దక్కడం, ప్రతిపక్షాల బలం బాగా తగ్గడాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ విధంగా అన్నారని అనుకోవచ్చు. 2014తో పోల్చుకుంటే కాంగ్రెస్ సీట్ల సంఖ్య కాస్త పెరిగినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం హోదా పొందేందుకు ఆ పార్టీకి ఇంకా మూడు సీట్లు కావాలి.
మోదీ ఇంత పెద్ద మనసు ఎందుకు చేసుకున్నట్లు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర చాలా ముఖ్యమని ఆయన చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా ప్రతిపక్షాల అభిప్రాయాలకు ఆయన గౌరవం ఇవ్వనున్నారా? నిన్న మోదీ మాటలు విన్నవారికి ఈ సందేహాలు తప్పక రావాలి. ఎందుకంటే నరేంద్ర మోదీ మాటలకూ చేతలకూ మధ్య చాలా అంతరం ఉంటుందన్నది గత అయిదేళ్లుగా దేశానికి అనుభవంలోకి వచ్చిన విషయం. గత అయిదేళ్లుగా ప్రధానమంత్రి హోదాలో మోదీ ప్రతిపక్షాలకు ఇచ్చిన గౌరవం, వారి అభిప్రాయాలకు ఇచ్చిన విలువ నామమాత్రం. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అనే నినాదాన్ని ఆయన పదేపదే వల్లె వేశారు. అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆనవాలు లేకుండా చేస్తానన్నారు.
మొన్నటి ఎన్నికల ప్రచార సభల్లో నరేంద్ర మోదీ తన అయిదేళ్ల పాలనలో తాను ఫలానా అభివృద్ధి సాధించాను కాబట్టి దానిని చూసి ఓటు వేయాలని కోరిన దాఖలాలు ఎక్కడా లేవు. పెరిగిపోయిన నిరుద్యోగం విషయంలో, పెద్ద నోట్ల రద్దు ఫలితాల విషయంలో, రఫేల్ యుద్ధవిమానాల కోనుగోలులో వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. దానికి బదులు బాలకోట్ విమాన దాడులను ఎంత రాజకీయం చేయవచ్చో అంత రాజకీయం చేశారు. ముఖ్యంగా బాలాకోట్ వైమానిక దాడుల ఫలితాన్ని ప్రశ్నించినందుకు కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిక్షాలను పాకిస్తాన్ అనుకూల పార్టీలుగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ వయనాడ్ ర్యాలీని చూస్తే అది పాకిస్తాన్లోనా అన్న భ్రమ కలిగిందని వ్యాఖ్యానించారు.
ఇదంతా ఒక ఎత్తయితే ప్రతిఫక్షాల నుంచి నాయకులను, చట్ట సభల సభ్యులను ప్రలోభపెట్టో, బెదిరించో బిజెపిలోకి లాక్కోవడం ఒక ఎత్తు. సాక్షాత్తూ ప్రధానమంత్రి ఫశ్చిమ బెంగాల్ ఎన్నికల సభల్లో మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యులు తమతో టచ్లో ఉన్నారని అన్నారు. తర్వాత కొందరు శాసనసభ్యులను బిజెపిలో చేర్చుకున్నారు కూడా. పశ్చిమ బెంగాల్ వ్యవహారాలు చూసే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ, ఏడు దశల పోలింగ్ను ప్రస్తావిస్తూ, ఇంకా ఆరు దశల్లో చేరికలు ఉంటాయని గొప్పలు చెప్పుకున్నారు.
దేశంలో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా ఇదే వ్యూహం అనుసరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేద్దామని టిఆర్ఎస్ సిఎల్పిని విలీనం చేసుకుంటే, కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బిజెపి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ బహిరంగంగా ఆ సంగతి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో టిడిపిని బలహీనపరిచి ప్రతిపక్షంగా ఎదిగేందుకు కూడా బిజెపి ఫిరాయిపుల దారినే ఎంచుకున్నది. ఎన్నికలలో గెలవాలంటే కోట్లాది ప్రజల మద్దతు సంపాదించాలి. దానికన్నా కొద్దిమంది ప్రజాప్రతినిధులను ఆకట్టుకోవడం సులువు కదా! సంఖ్య ముఖ్యం కాదన్న నరేంద్ర మోదీ కనుసన్నలలో మెలిగే బిజెపి దేశమంతా బలపడేందుకు అనుసరిస్తున్న నీతి ఇది.
ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందేందుకు అవసరమైన సంఖ్యాబలానికి కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు తగ్గాయి. కాంగ్రెస్ గానీ ఇంకో ఎక్స్ పార్టీ గానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే దేశానికి కలిగే ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ హోదాలో సిబిఐ డైరక్టర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, లోక్పాల్ వంటి ముఖ్యమైన పదవులకు నియామకాలు జరిపే కమిటీల్లో సభ్యుడిగా ఉంటారు. క్రితంసారి సిబిఐ, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ పదవుల భర్తీ కమిటీల్లో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గేకు సభ్యత్వం కల్పించిన మోదీ ప్రభుత్వం లోక్పాల్ విషయంలో మాత్రం ససేమిరా అన్నది.
ఈసారి ఎన్నికల్లో బిజెపి నుంచి లోక్సభకు ఎన్నికయిన గుజరాత్ రాజ్యసభ సభ్యులు అమిత్ షా, స్మృతి ఇరానీ ఆ సభ్యత్వాలకు రాజీనామా ఇచ్చారు. ఇప్పుడు ఆ రెండు ఖాళీలకూ విడివిడిగా ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పోలింగ్ జరిగేది ఒకే రోజు అయినా రెండు సీట్లకూ విడివిడిగా నోటిఫికేషన్ ఇస్తారని ఎన్నికల కమిషవ్ ప్రకటించింది. ఇలా విడివిడిగా పోలింగ్ జరపడం సమర్ధనీయమే అంటూ అందుకు సాక్ష్యంగా ఎన్నడూ లేనిది ఢిల్లీ హైకోర్టు తీర్పులను కమిషన్ తమ ప్రకటనలో పేర్కొన్నది.
ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదో అర్ధం చేసుకోవడం కష్టమేమీ కాదు. మొన్నటి లోక్సభ ఎన్నికలలో కమిషన్ పనితీరు అందరూ గమనించారు. విడివిడిగా ఎన్నికలు జరిపితే ఆ రెండు రాజ్యసభ సీట్లూ బిజెపి వశం అవుతాయి. కలిపి జరిపితే ఒక సీటు కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషన్పై బిజెపి వత్తిడి ఉందనడానికి సాక్ష్యాధారాలు లేవుగా అని ఎవరైనా అనవచ్చు. నిజమే. మరి బిజెపి నాయకత్వానికి సంఖ్య ముఖ్యం కాదుగా! రాజ్యసభ కూర్పు వెనకున్న సూత్రమే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కాబట్టి, ఆ ప్రకారం న్యాయంగా ఒక సీటు కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఇలా చేయడం తప్పని బిజెపి ప్రకటించవచ్చుగా!
గత అయిదేళ్ల కాలంలో రాజ్యసభలో బిజెపికి మెజారిటీ లేనందున చాలా బిల్లుల విషయంలో ఆ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు బిజెపి నాయకత్వం ఒక దారి ఎంచుకున్నది. అదేమంటే ప్రతిపక్షం నుంచి వ్యతిరేకత వస్తుందనుకున్న బిల్లులను ఆర్ధిక బిల్లులుగా లోక్సభలో ప్రవేశపెట్టడం. ఆర్ధిక బిల్లులయితే రాజ్యసభ ఆమోదం తప్పనిసరి కాదు కాబట్టి అప్పటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మహాశయుడు ఈ సులువు కనిపెట్టారు. ఆధార్ బిల్లును కూడా ఈ విధంగా ఆర్ధిక బిల్లు కింద ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాయి. రాజ్యసభలో మెజారిటీ ఉంటే ఈ వివాదాలు, ఈ తిప్పలు తప్పుతాయి కదా!
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర చాలా ముఖ్యమైనదని అంటున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ విశాల హితాన్ని దృష్టిలో ఉంచుకుని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వగలరా? ప్రజాస్వామ్యం ప్రాధమిక స్ఫూర్తికి విఘాతం కలిగించే ఫిరాయింపులను మేము ప్రోత్సహించేది లేదు అని విస్పష్టంగా ప్రకటించగలరా? తన మాటలకు చేతలకూ మధ్య ఏమాత్రం వ్యత్యాసం ఉండదని నిరూపించుకునేందుకు ఆయనకు ఇది ఒక మంచి అవకాశం. సంఖ్య ముఖ్యం కాదని ప్రధానమంత్రి గారే స్వయగా అంటున్నారుగా!
ఆలపాటి సురేశ్ కుమార్