అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై అనుమతులు లేకుండా డ్రోన్లు వినియోగించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ ఎగరడంపై సోమవారం టిడిపి నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలసి ఫిర్యాదు అందజేశారు. టిడిపి మాజీ మంత్రులు కె అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, ఎంపిలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రనాధ్, కేశినేని నాని, తోట సీతామహాలక్ష్మి, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, మద్దాల గిరి, నిమ్మల రామానాయుడు తదితల నేతల బృందం సోమవారం విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ కలిసి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఫిర్యాదు అందజేశారు. వైసిపి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందనీ, హైసెక్యురిటీ జోన్లో ప్రతిపక్ష నేత నివాసంపై అనుమతులు లేకుండా డ్రోన్ వినియోగించారనీ, చంద్రబాబు భద్రత పెంపుపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదనీ వారు వివరించారు.
డ్రోన్ ఎగరవేస్తూ పట్టుబడిన వ్యక్తి జగన్ నివాసంలో ఉండే కిరణ్ అదేశాల మేరకు చిత్రీకరించానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని టిడిపి నేతలు పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాజీ మంత్రి కె అచ్చెన్నాయుడు మట్లాడారు. వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం కక్షసాధింపుగా వ్యవహరిస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గోదావరి వరదల సమయంలో జెరూసలేం విహార యాత్రకు వెళ్ళారనీ, కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో అమెరికా పర్యటనకు వెళ్లారని అచ్చెన్నాయుడు విమర్శించారు. వరద పరిస్థితులను అంచనా వేసి మేనేజ్మెంట్ చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.