శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన తర్వాత జమ్ము కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు దాదాపు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో దశలవారీగా ఆంక్షలను సడలిస్తున్నారు. శ్రీనగర్లో పలు పాఠశాలలను సోమవారం పునః ప్రారంభమయ్యాయి. శ్రీనగర్లో 900 ప్రాధమిక పాఠశాలలకు గానూ 196 పాఠశాలలను సోమవారం పునః ప్రారంభం అవుతున్నాయని శ్రీనగర్ డిప్యూటి కమిషనర్ షాదిక్ ఇక్బాల్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను సమీక్షించిన తరువాత కొన్ని పాఠశాలలను తెరిచామనీ, పాఠశాలలు తెరిచిన చోట్ల పిల్లలను పంపాల్సిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నామని ఇక్బాల్ చెప్పారు. వారికి భద్రత కల్పించడం తమ బాధ్యతగా ఆయన తెలిపారు. మొత్తం 12 జిల్లాలలో సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పని చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
కశ్మీర్ లోయలో మూడింట రెండు వంతుల ల్యాండ్ లైన్లను పునరుద్దరించారు. భద్రతా పరిస్థితిని సమీక్షించిన తరువాత మోబైల్ ఇంటర్నెట్ సేవలు సైతం దశలవారీగా అందుబాటులోకి రానున్నాయని వెల్లడిస్తున్నారు.
ఆగస్టు అయిదున జమ్ము కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు చేయడానికి ఒక రోజు ముందు నుంచీ రాష్ట్రంలో తీవ్ర నిర్భంధం అమలులో ఉంది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా దాదాపు 400మందీ రాజకీయ నాయకులు ప్రభుత్వ నిర్భంధంలో ఉన్నారు.