అమరావతి : సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకూ ప్రతి నెలా ఒక కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి సెప్టెంబర్ చివరి వారంలో పది వేల రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన లబ్దిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 15న రైతు భరోసా పథకం ప్రారంభిస్తున్నట్లు జగన్ చెప్పారు. రైతు భరోసా రైతులతో పాటు కౌలు రైతులకూ ఇస్తామని జగన్ తెలిపారు. నవంబర్ నెలలో 21వ తేదీన మత్స్యకార్మిక దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు పదివేల రూపాయల వంతున ఇవ్వనున్నట్లు జగన్ తెలిపారు. పడవలు, బోట్లు ఉన్న మత్స్యకారులకు ఈ ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకాన్ని తీసుకువచ్చామని జగన్ తెలిపారు. అదే విధంగా మత్స్యకారులకు లీటరు డీజిల్పై ప్రస్తుతం ఇచ్చే ఆరు రూపాయల సబ్సిడీని తొమ్మిది రూపాయలకు పెంచుతున్నట్లు జగన్ తెలిపారు. డిసెంబర్ 21న మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24వేల రూపాయలు అందించనున్నట్లు జగన్ చెప్పారు.
జనవరి 26న అమ్మఒడి కార్యక్రమాన్ని అమలులోకి తీసుకువస్తున్నామని జగన్ చెప్పారు. పిల్లలను బడిలో పంపే తల్లులకు 15వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని జగన్ తెలిపారు. ఫిబ్రవరి చివరి వారంలో షాపులు ఉన్న నాయి బ్రాహ్మణులకు, షాపులు ఉన్న టైలర్లు, షాపులు ఉన్న రజకులకు పది వేల రూపాయల చొప్పున అందిస్తామని జగన్ వెల్లడించారు. వైఎస్ఆర్ పెళ్లికానుకను ఫిబ్రవరి చివరి వారంలోనే అమల్లోకి తీసుకువస్తామని జగన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న మొత్తాన్ని పెంచి అందజేయడం జరుగుతుందని జగన్ చెప్పారు. మార్చి చివరి వారంలో ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు సంబంధించి అర్చకులకు, అలానే మసీదుల్లో ఇమాం, మౌజంలకు, చర్చిల ఫాదర్లకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు.
మార్చి నెల చివరలో ఉగాది పండుగ రోజున 25లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు జగన్ వెల్లడించారు. ఈ పథకాలు అన్ని అర్హులకు సక్రమంగా అందేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశించారు.
అనంతరం అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ నుండి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.