(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కేరళలో దుమారం రేపిన దళిత క్రిస్టియన్ కెవిన్ జోసెఫ్ హత్య కేసులో కొట్టాయం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది పరువు హత్య అని తేల్చిన కోర్టు.. కెవిన్ను హత్య చేసిన పది మంది నిందితులకు జీవితఖైదు శిక్షను విధించింది. కోర్టు తీర్పుపై కెవిన్ తండ్రి జోసెఫ్ హర్షం వ్యక్తం చేయలేదు. నిందితులకు జీవితఖైదు శిక్ష సరిపోదని ఊరి శిక్ష పడితేనే.. తమకు న్యాయం జరిగినట్లు భావిస్తానని చెప్పారు. అయితే హత్యకు కుట్ర చేసిన నీనూ తండ్రి చాకో ఇంకా బయటే ఉన్నారన్నారు. ఆయనకు కూడా శిక్ష పడాలన్నారు. న్యాయం కోసం తాను హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎస్పీ హరీష్ కుమార్కు కృతజ్ఙతలు తెలిపారు. కేరళలోని కొల్లాంకు చెందిన జోషెఫ్, నీనూలు ప్రేమించుకున్నారు. అయితే వీరి వివాహానికి కులం అడ్డు రావడంతో.. గత ఏడాది మే 24న వీరిద్దరూ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. జోసెఫ్ దళితుడు కావడంతో నీనూ తల్లిదండ్రులుతోపాటు సోదరుడు వీరి పెళ్లిని వ్యతిరేకించారు. వివాహం జరిగిన రోజు రాత్రి కొందరు దుండగులు ఆయుధాలతో కెవిన్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో వస్తువులను పగలగొడుతూ నానాహంగామా సృష్టించారు. కెవిన్తోపాటు అతని స్నేహితుడు అనీష్ను కిడ్నాప్ చేశారు. అనంతరం అనీష్ను విడిచిపెట్టినప్పటికీ.. కెవిన్ను వదల లేదు. కొల్లాంలోని థెన్మలా ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు.
నీనూ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తన సోదరుడితో పాటు మరికొందరికి ఈ హత్యవెనుక ప్రమేయం ఉన్నట్టు నీనూ తన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు ప్రాణహాని ఉందని చెప్పినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించారని నీనూ ఆరోపించింది. ఈ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై పలు దళిత సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళనలు చేశారు. పరువు హత్యకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును వేగంగా దర్యాప్తు చేశారు. ఈ హత్య కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. నీనూ సోదరుడు స్యాను చాకో సహా పది మందిని ఐపీసీ 364ఏ సెక్షన్, 302 సెక్షన్ ప్రకారం న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. అదే సమయంలో నీనూ తండ్రిని, మరో ముగ్గురు నిందితులను ఆధారాలు లేవని కోర్టు విడిచిపెట్టింది.