ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఈ రోజు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముంబైలోని వర్లీ నియోజక వర్గం నుంచి ఆదిత్య ఠాక్రే పోటీ చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తి మొత్తం 16 కోట్ల 5 లక్షలు అని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. శివసేనను స్థాపించిన బాల్ఠాక్రే కుటుంబం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి వ్యక్తి ఆదిత్య ఠాక్రే కావడం విశేషం. వర్లీ నియోజక వర్గంలో శివసేనకి మంచి పట్టు ఉంది. దీంతో ఆదిత్య ఠాక్రేను ఇక్కడి నుంచి బరిలో దింపాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆదిత్య మొదటిసారి ఎన్నికల బరిలో దిగడం, దీనికితోడు మంచి పట్టున్న వర్లీ అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకోవడంతో ఇక విజయం తధ్యమని పార్టీ నేతలు భావిస్తున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు ఇవాళ ముంబైలో భారీ రోడ్షో నిర్వహించారు. ఈ ర్యాలీలో జనం భారీగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టు ‘నేను మహారాష్ట్రకి కాబోయే సీఎంతో మాట్లాడుతున్నానా’? అని ఆదిత్యని ప్రశ్నించారు. దీనికి చిరునవ్వు చిందించిన అదిత్య ఠాక్రే.. ‘’మీరు ఎల్లప్పుడూ రాష్ట్రానికి సేవ చేసే వ్యక్తితో మాట్లాడుతన్నారు’’ అని సమాధానం ఇచ్చారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లే ముందు ఆదిత్య.. ఇంట్లోనే శివసేన వ్యవస్థాపకుడు, తాతయ్య బాల్ ఠాక్రే ఫోటో వద్ద ఆస్సులు తీసుకున్నారు. ముంబై ఓటర్లు ఆదిత్యకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆదిత్య తండ్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. తమ కుటుంబంలో సామాజిక సేవ చేసే సాంప్రదాయం ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ముందు అనుకున్నామని తెలిపారు. కానీ పరిస్థితులు మారాయి, నియోజకవర్గ ప్రజల కోసం ఆదిత్య ఎప్పుడూ అండగా ఉంటారని భావిస్తున్నట్లు ఉద్దవ్ చెప్పారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోనని ఉద్దవ్ స్పష్టం చేశారు.
— Aaditya Thackeray (@AUThackeray) October 3, 2019
ఐదు దశాబ్ధాలుగా ఠాక్రే కుటుంబం ప్రభుత్వంలో ఎలాంటి పదవులు ఆశకుండా కేవలం పార్టీ పదవులకే పరిమితమైన సంగతి తెలిసిందే. పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందిగాని, పార్టీ అధ్యక్షులు ఎప్పుడు బరిలో నిలబడలేదు. అయితే, ఈ సారి ఠాక్రే కుటుంబం నుంచి ఆదిత్య ఠాక్రే మొదటిసారి ఎన్నికల బరిలో దిగడంతో ఈ ఎన్నికలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మహారాష్ట్రలో మెజారిటీ స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి పదవిని పొందాలని శివసేన పార్టీ చూస్తోంది. ఈ దిశగానే పార్టీ పావులు కదుపుతోంది.
మరోవైపు ఆదిత్యను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బీజేపీతో ఉన్న 30 ఏళ్ల అనుబంధానికి తెరపడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏళ్లుగా ఈ రెండు పార్టీలు కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు కొన్ని రోజులు కత్తులు దూసినా అనంతరం మళ్లీ కలిసే పోటీ చేశాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వేరువేరుగా పోటీ చేసినప్పటికీ కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ సరస్పరం ఈ రెండు పార్టీల నేతలు విమర్శలు చేసుకోవడం రివాజుగా మారింది. ఆదిత్యను తీసుకురావడం ద్వారా అటు సీట్ల ఒప్పందం విషయంలోనూ, ఇటు సీఎం కూర్చి వ్యవహారంలో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనెల 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నాయి.