అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రికి పంపించారు. కారెం శివాజీని గత టిడిపి ప్రభుత్వం ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్గా నియమించింది. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా కారెం శివాజీ ఈ నామినేటెడ్ పదవికి రాజీనామా చేయకుండా ఇప్పటి వరకూ కొనసాగుతూ వచ్చారు.
కారెం శివాజీ ఇటీవల టిడిపి అధిష్టాన వైఖరికి భిన్నంగా ఇంగ్లీషు మాద్యమంపై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కారెం శివాజీ వ్యాఖ్యానించారు. దీన్ని రాజకీయ కోణంలో చూసి రాద్ధాంతం చేయడం మానుకోవాలని కూడా హితవు పలికారు. దీన్ని వ్యతిరేకించే వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. కారెం శివాజీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో టిడిపిని వీడే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్ పదవిని కాపాడుకునేందుకే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారని విమర్శలు వచ్చాయి. సరిగ్గా వారం రోజుల క్రితమే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన కారెం శివాజీ అకస్మాత్తుగా తన నామినేటెడ్ పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ పంపారు.