అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడే అర్హత టిడిపికి లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం సమస్యలపై టిడిపి సభ్యులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, డాక్టర్ నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చిన రాజప్ప, కింజరపు అచ్చెన్నాయుడు, కరణం బలరామకృష్ణ మూర్తి అడిగిన ప్రశ్నలపై మంత్రి కన్నబాబు సమాధానం ఇస్తూ టిడిపిపై విమర్శలు గుప్పించారు.పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి టిడిపి సభ్యులు మాట్లాడుతున్నారనీ, ఈ రాష్ట్రంలో పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం టీడీపీకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదనీ కన్నబాబు అన్నారు. పార్టీలే కాదు, బీ–ఫారాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారని ఆయన విమర్శించారు. 2014 నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వ్యక్తి తమ నాయకుడు వైయస్ జగన్ మాత్రమేనని అన్నారు.ఢిల్లీలో, గుంటూరులో దీక్షలు, ధర్నాలు చేయడంతో పాటు యువభేరీ కార్యక్రమాలు నిర్వహించారని కన్నబాబు చెప్పారు. వైసిపి ఎంపిలతో జగన్ రాజీనామాలు కూడా చేయించారన్నారు.
ప్రత్యేక హోదా కన్నా, ప్రత్యేక ప్యాకేజీయే బెటరని అప్పట్లో బల్లగుద్దినట్టు ఇదే చంద్రబాబు చెప్పారని కన్నబాబు పేర్కొన్నారు.ఇప్పుడు అదే వ్యక్తులు నీతులు చెప్తున్నారని కన్నబాబు విమర్శించారు. ఆ రోజు సిఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అవసరంలేదు, ప్రత్యేక ప్యాకేజీ చాలని చంద్రబాబుగారు చెప్పారా? లేదా? వివరించాలని కన్నబాబు కోరారు.ఆ తర్వాత ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారనీ, జగన్మోహన్రెడ్డిని అభిమానిస్తున్నారనీ రాత్రికి, రాత్రి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని కన్నబాబు అన్నారు.హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఓటకు కోట్లు కేసులో దొరికిపోయి పారిపోయి ఈ రాష్ట్రానికి వచ్చేశారని కన్నబాబు విమర్శించారు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు.నాడు చేసిందంతా చేసి ఇవాళ నీతి కథలు, పిట్ట కథలు చెప్తున్నారని కన్నబాబు విమర్శించారు.
రాష్ట్రానికి మోది అన్యాయం చేశారని ఎన్నికల ముందు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మోదితో జతకట్టే ప్రయత్నం చేస్తున్నారని కన్నబాబు అన్నారు. నలుగురు ఎంపీలను బిజెపిలోకి వలస పంపించి మళ్లీ ఇక్కడ మరోలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. అదే విధంగా ఆస్తుల పంపిణీ గురించి కూడా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
ప్రస్తుతం తెలంగాణకు ఇచ్చిన భవనాల్లో ఏదీ కూడా విభజన చట్టంలోని పరిధిలోనివి కాదని కన్నబాబు అన్నారు. విభజన చట్టంలో భవనాల్లోని ఒక్క గదిని కూడా తెలంగాణకు అప్పగించలేదని వివరించారు.టిడిపి అధికారంలో ఉండగా విభజన చట్టంలోని భవనాలను ఆక్రమిస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదని కన్నబాబు గుర్తు చేశారు.