(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అనంతపురం జిల్లాలో ఆరేళ్ల కిందట జరిగిన 70 ఏళ్ల వృద్ధురాలి అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష… రూ. 10 వేలు జరిమానా విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు తీర్పు వెలువరించింది. 2013 ఆగస్టు 24 తేదీ రాత్రి కంబదూరు మండలం అండేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అరుపులు వినిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ వృద్ధురాలిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ఆ తర్వాత అనంతపురం తరలించి మెరుగైన వైద్య సేవలు అందించారు. అప్పటి కళ్యాణదుర్గం సి.ఐ జి.రామకృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై సోమవారం అనంతపురం మహిళా కోర్టు విచారణ జరిపింది. వాదోపవాదలను విన్న కోర్టు.. నిందితుడికి పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పుపై మహిళా సంఘాలు, బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.