అమరావతి: వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమలులో వైసిపి ప్రభుత్వం అంచలంచెలుగా మాట తప్పుతోంది అనాలా?లేక మోసం చేస్తోంది అనుకోవాలా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా వృద్ధాప్య పెన్షన్ అమలు తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
‘ఎన్నికల సమయంలో వృద్ధాప్య పెన్షన్ రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయలు ఇస్తామని వైసిపి చెప్పింది. అదే విధంగా వృద్ధాప్య పెన్షన్ లబ్దిదారుల అర్హత వయసును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక వీటిలో ఏ ఒక్కదానినీ నెరవేర్చలేదు’ అని పవన్ పేర్కొన్నారు.
ఎన్నికల హామీలో పేర్కొన్నట్లుగా పెన్షన్ మూడు వేల రూపాయలు చేయకుండా 2,250 రూపాయలు మాత్రమే చేశారని ఆయన విమర్శించారు. దీని ద్వారా ఒక్కొ పెన్షన్ దారుడు నెలకు 750 రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. పెన్షన్ అర్హత వయసు 65 నుండి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని మే 30వ విడుదల చేసిన జివో నెం.103 ద్వారా చెప్పారనీ, ఆ విధంగా చూసుకున్నా కొత్తగా మరో పది లక్షల మందికి పెన్షన్ దక్కాల్సి ఉంది కానీ ఈ రోజు వరకూ ఒక్క కొత్త పెన్షన్ లబ్దిదారుని పేరు కూడా నమోదు అవ్వలేదని పవన్ అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న 2,250 రూపాయలు లెక్కన చూసుకున్నా ఒక్కో కొత్త పెన్షన్ అర్హత ఉన్న లబ్దిదారుని కుటుంబం ఈ ఏడు నెలల్లో 15,750 రూపాయలు కోల్పోయిందని పవన్ పేర్కొన్నారు.
G.O on Old age Pension Scheme pic.twitter.com/P1twd5vMMu
— Pawan Kalyan (@PawanKalyan) December 16, 2019