ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరాహారదీక్షలకూ ధర్నాలకూ దిగకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఒకే ఒక్క మాటతో పిటిషన్ను తోసిపుచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ నాయకులు నిరసనలూ, దీక్షల అలవాటును మానుకోలేదు. కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బిజెపిని మట్టి కరిపించి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో గెలిచింది. ఓటమి పరాభవం తట్టుకోలేని బిజెపి అప్పటినుంచీ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంది. కేంద్రం నియమించే లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో అధికారాలు ఉన్నందున బిజెపికి ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం సులువయింది.
లెఫ్టినెంట్ గవర్నర్ అండ చూసుకుని గత సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వంలోని ఐఎఎస్లు సహాయ నిరాకరణ చేశారు. వారిని దారిలో పెట్టాలన్న విజ్ఞప్తిని లెఫ్టినెంట్ గవర్నర్ పెడచెవిన పెట్టడంతో మరో దారి లేక ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు గత ఏడాది జూన్లో ఆయన కార్యాలయంలోనే రెండు వారాల పాటు ధర్నా చేశారు.
హరినాధ్ రామ్ అనే వ్యక్తి తన పిటిషన్లో ఈ విషయం ప్రస్తావించారు. ఈ నిరసన రాజ్యాంగ విరుద్ధమనీ, దీని వల్ల రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందనీ ఆయన వాదించారు. ముఖ్యమంత్రులు ఇలాంటి నిరసనలకు దిగకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయన కోరారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి నిరశనదీక్షకు దిగుతారు. దానిని సుప్రీంకోర్టు నిరోధించాలని మీరు కోరుతున్నారు. డిస్మిస్డ్ అన్నారు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్.