(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఓ వైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తూ ప్రభుత్వాన్ని, ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. మరో పక్క కరోనా ఆసుపత్రికి మీ పార్టీ భవనం ఇవ్వమంటే, మీ పార్టీ అధినేత భవనం ఇవ్వండి అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా వేడి పుట్టిస్తున్నారు.
హైదరాబాద్ లో ఖాళీగా పడున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను కరోనా హాస్పిటల్ కు ఇస్తే తెలంగాణా ప్రజల రుణం తీర్చుకున్నట్టవుతుందని బాబుకు అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయనీ, ఇటువంటి క్లిష్ట సమయంలో పెద్ద మనసు కనబర్చాలనీ, పార్టీ వ్యవస్థాపకుడి ఆత్మ కూడా శాంతిస్తుందనీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు.
హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న లోటస్ పాండ్ ఇంద్ర భవనం,బెంగుళూరు లో ఖాళీగా ఉన్న యలహంక రాజ ప్రసాదం కరోనా ఆసుపత్రికి ఇవ్వాలని,ఆధునిక వసతులు ఉన్న భవనాలు కావడంతో కరోనా రోగులకు మంచి వైద్యం అందించే అవకాశం ఏర్పడుతుంది అని ఆయా రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారనీ బుద్ధా పేర్కొంటూ వైఎస్ జగన్ గారు పెద్ద మనస్సు చేసుకొని ఆ భవనాలు ఇస్తే ప్రజా ధనం కొట్టేసి నరకానికి వెళ్లిన వైకాపా ఆత్మకి కొంత ఊరట వచ్చే అవకాశం ఉంటుందని ప్రతి విమర్శ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్లపై ఆయా పార్టీల అభిమానులు స్పందిస్తూ లైక్లు, రిట్విట్లు చేస్తున్నారు.