కడప, జనవరి 18: కాంగ్రెస్ పార్టీతో ఏ రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ భూస్థాపితమేనన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ అన్నారు. కడపలో శుక్రవారం నిర్వహించిన బిజెపి రాయలసీమ స్థాయి పార్లమెంటరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకురాలు దగ్గుపాటి పురందేశ్వరి తదితర నేతలు పాల్గొన్నారు
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్ టిఆర్ వర్ధంతి సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు.
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్ టిఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.
మోడీ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఆర్థిక బలమైన దేశాల్లో భారత్ ఆరవ స్థానంలో నిలిచిందని చెప్పారు. పార్లమెంటులో సొంతంగా బలం ఉన్నా భాగస్వామ్య పార్టీలను బిజెపి గౌరవిస్తుందని రాజ్నాధ్ అన్నారు.
కూటమితో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని కొనసాగించిన ఘనత పీవీ నరసింహారావు దక్కిందనీ, ఆ మాజీ ప్రధాని పట్ల కాంగ్రెస్ వ్యవహరంచిన తీరు ఆంధ్ర ప్రజలు, చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని రాజ్నాథ్ అన్నారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలు అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళల ఇళ్లల్లో దీపాలు వెలిగించలేక పోయారనీ, తమ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో ఇంటింటికి విద్యుత్ అందించామని రాజ్నాధ్ అన్నారు.
పాకిస్తాన్ టెర్రరిస్టులను వారి భూభాగంలోనే మట్టు పెట్టిన ఘనత భారత్ ఆర్మీ దని ఆయన అన్నారు.
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వలేదనీ, విభజన చట్టంలో పొందుపరిచిన 80 శాతం అమలు చేశామని రాజ్నాధ్ చెప్పారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంసిగ్దత వ్యక్తం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వలేదని అన్నారు.
రాష్ట్ర జిల్లాల అభివృద్ధికి వందల కోట్లు నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాజ్నాథ్ చెప్పారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దయోదర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.