వైసిపి ,టిడిపితో సమ దూరం పాటిస్తూ ఆంధ్రప్రదేశ్లో సొంత బలాన్ని, బలగాన్ని నిర్మించుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి భవిష్యత్ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించేందుకు భారతీయ జనతాపార్టీ ప్రణాళికాబద్దంగా పావులు కదుపుతోంది. ఏ విషయంలోనూ వైసీపీ సర్కారును వెనకేసుకురాకూడదని నిర్ణయించుకున్నట్లుగానే కనిపిస్తోంది. అగ్రనాయకులతో సాన్నిహిత్యాన్ని ఆసరాగా చూపుతూ రాష్ట్రంలో బీజేపీ నేతలను నియంత్రించాలని వైసీపీ కొంతమేరకు ప్రయత్నించింది
అయితే దానిని తిప్పికొట్టే రివర్స్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు కమలనాథులు. గతంలో తెలుగుదేశంతో సాన్నిహిత్యం పార్టీ ఎదుగుదలను నిరోధించింది. వైసీపీ పట్ల అదే ధోరణి కనబరిస్తే పార్టీకి భవిష్యత్ ఉండదన్న విషయాన్ని స్థానిక నాయకులు బీజేపీ అగ్రనాయకత్వానికి స్పష్టంగానే చెప్పేశారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవి స్వీకరించిన తర్వాత టీడీపీకి, బీజేపీకి ఉన్న సామీప్యత తగ్గుతూ వచ్చింది. ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు నాయుడి స్వయంకృతాపరాధం దూరాన్ని మరింత పెంచింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ బీజేపీ వైపు ఎన్నికల్లో వేలెత్తి చూపకుండా వైసీపీ అధికారంలోకి వచ్చేసింది.అధికారపార్టీతో పోలిస్తే పదిశాతం పైచిలుకు ఓట్ల తేడాతో బలహీనమైన ప్రతిపక్షంగా టీడీపీ మిగిలిపోయింది.
నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు అటు వైసీపీ వైపో, బీజేపీ వైపో క్యూ కడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ అధిష్ఠానం ముందు సాగిలపడుతోంది. ప్రత్యేకహోదా వంటి అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. తాను కమలం పార్టీతో కలిసినడుస్తానని సంకేతాలు ఇస్తోంది. వైసీపీ కూడా బీజేపీని సానుకూలంగానే ఆదరిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను దెబ్బకొట్టి తనంతట తాను బలం సమకూర్చుకోవడానికి బిజెపి పావులు కదుపుతోంది.ప్రధానంగా అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ దూసుకు వెళుతోంది.నిజానికి వైసీపీకి బలం, బలగం ఉంది. బీజేపీని దీటుగా ఎదుర్కోగలదు.
కానీ బీజేపీని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేసేందుకు ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. దీంతో పార్టీ శ్రేణులు చేష్టలుడిగి ఉండిపోవాల్సి వస్తోంది.పార్టీలో రెండో స్థానంలో ఉన్నట్లుగా వైసీపీ నేతలు భావించే విజయసాయి రెడ్డి వైసీపీకి, బీజేపీకి మధ్య బ్యాలెన్స్ నెలకొల్పే ప్రయత్నం చాలా వరకూ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ఒంటికాలుపై లేస్తున్నారు దీనిని వ్యూహాత్మకంగా తిప్పికొట్టాలని విజయసాయిరెడ్డి ప్రయత్నించారు. కన్నా లక్ష్మీనారాయణకు, టీడీపీ అధినేతకు సంబంధం అంటగట్టి బీజేపీని, కన్నాను వేరు చేయాలనే ధోరణిలో విమర్శలు చేశారు.అయితే అది వికటించి వైసీపీకే కష్టాలు తెచ్చిపెట్టింది.
దీంతో ముఖ్యమంత్రికి సైతం చిక్కులు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రానికి అనేక సమస్యలు విన్నవించేందుకు అగ్రనాయకత్వంతో భేటీకి సంప్రతించినా బీజేపీ రాష్ట్ర నాయకులు గండి కొట్టారనే వాదనలున్నాయి. విజయసాయి రెడ్డి ప్రధాని, అమిత్ షా లతో నేరుగా సత్సంబంధాలు నెరుపుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పోరాటాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగడలు వేస్తున్నారనేది అధిష్టానానికి ఆంతరంగికంగా అందిన ఫిర్యాదు. ఫలితంగానే వైసీపీ అగ్రనాయకత్వంతో బీజేపీ అగ్రనాయకత్వం ఏరకంగానూ సన్నిహితంగా బహిరంగంగా కనిపించకూడదని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ క్రమేపీ బలహీనపడుతున్న స్థితిలో బీజేపీ, జనసేన కాంబినేషన్ కు రాష్ట్రంలో మంచి అవకాశాలున్నట్లు బీజేపీ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో వివిధ అంశాలపై సర్కారుపై ఉద్యమాలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర శాఖకు మద్దతుగా నిలవాలని అధిష్టానం నిర్ణయించింది. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో వైసీపీ వర్సెస్ బిజెపి రాజకీయాలు కొనసాగే సూచనలు గోచరిస్తున్నాయి.