తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డే లేకుండా పోతోంది. గురువారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. మొత్తం 352 కరోనా కేసులు నమోదైనట్లు కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.
అయితే వీటిలో 302 కేసులు రికార్డు స్థాయిలో అత్యధికంగా జిహెచ్ఎంసి పరిధిలోనే నమోదు కావడం విశేషం. అలాగే పొరుగు జిల్లా అయిన రంగారెడ్డి లో మరో 17 కేసులు బయట పడ్డాయి. ఇలా మొత్తం కేసుల్లో 92 శాతం కేసులు ఈ రెండు జిల్లాల నుండే బయటపడటం గమనార్హం.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6027కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 2,531గా ఉన్నాయి. గత 24 గంటల్లో 230 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3301కు చేరింది. ఇక గురువారం ముగ్గురు కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 195కి చేరింది.
జిల్లాల వారీగా చూసినట్లైతే…. మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో 10, మంచిర్యాలలో 4, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, భూపాలపల్లి జిల్లాల్లో 2 కేసుల చొప్పున, జనగామ మరియు వరంగల్ అర్బన్లో 3 కేసులు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.