ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్ర రాష్ట్రంలో 13,923 మంది నమూనాలు సేకరించి పరీక్షించగా 425 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. కరోనా మొదలైనప్పటినుండి ఏపీ లో ఇదే అత్యధికం.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసిన దాని ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిలో మొత్తం 5854 పాజిటివ్ రాగా, ఇందులో 2983 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 2779 మంది చికిత్స పొందుతున్నారు.
తాజాగా నమోదైన 425 కేసుల్లో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 126 ఉండగా, రాష్ట్రంలో 299 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7496కు చేరింది.
విదేశాల నుంచి వచ్చినవారిలో 289 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ముగ్గురు ఈ రోజు డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు 51 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మొత్తం 611 యాక్టివ్ కేసులు ఉన్నాయి.