Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు ను జైల్ లో వద్దు, గృహ నిర్బందంలో ఉంచండి అంటూ చంద్రబాబు తరపున దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. వాదనలు మిగిసిన అనంతరం సాయంత్రం తీర్పు వెలువడుతుందని భావించినప్పటికీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేస్తూ రేపు ఉత్తర్వులు ఇస్తానని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ద లుథ్రా వాదనలు వినిపించారు. రాజమండ్రి జైల్ కంటే మించిన సెక్యురిటీ ఎక్కడా ఉండదని అదనపు ఏజీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు 50 అడుగుల గోడ ఉంటుందనీ, అక్కడకు ఎవ్వరూ రాలేరన్నారు.
చంద్రబాబుకు ఇంట్లో కంటే జైలులోనే భద్రత ఉంటుందనీ, చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగా ఉందని ఏఏజి తెలిపారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారనీ, ఆయన భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదనీ, జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గదితో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని తెలియజేస్తూ చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డీజీ అదేశాల లేఖను న్యాాయమూర్తి ముందు ఉంచారు. గృహ నిర్బంధం పిటిషన్ ను డిస్మిస్ చేయాలని ఏఏజీ కోరారు.
చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు ఇప్పటి వరకూ ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు కు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉందన్నారు. హౌజ్ కస్టడీ కి సంబంధించి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఉందని గుర్తు చేశారు. ఆయన వయసు, హోదా దృష్ట్యా హౌజ్ రిమాండ్ ఇవ్వాలని కోరారు.
జైలులో భద్రత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని , రాష్ట్ర ప్రభుత్వం భద్రత పై అనుమానంతోనే ఎన్ఎస్ జీ భద్రత ఉందని, ఆయన జైలులో ఉంటే ఎన్ ఎస్ జీ కమెండోలు బయటే ఉంటారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. రేపు ఉత్తర్వులు వెలువరిస్తామని కోర్టు ప్రకటించింది,