TDP Leaders celebrations: చంద్రబాబు అరెస్టు అయి జైలుకు వెళితే టీడీపీ నాయకులు ఓ చోట సంబరాలు చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. విషయంలోకి వెళితే.. టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు రోడ్డు మార్గంలో విజయవాడ కు తీసుకువచ్చారు. సాయంత్రం నుండి రాత్రి మొత్తం సిట్ కార్యాలయంలో విచారణ జరిపి అదివారం వేకువజామున కోర్టులో హజరుపర్చారు.
అయితే ఏసీబీ కోర్టులో రిమాండ్ రిపోర్టుపై వాదనలు మొదలు కావడంతో చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరుపున ప్రభుత్వ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే సోషల్ మీడియాలో చంద్రబాబు రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరిస్తుందని, చంద్రబాబు వెంటనే బయటకు వస్తారంటూ టీడీపీ శ్రేణులు భావించారు.
ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వాడివేడిగా వాదనలు ముగిసిన తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి .. సాయంత్రం తీర్పు వెలువరించారు. 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. మరో పక్క ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహంతో చంద్రబాబుకు బెయిల్ వచ్చేసినట్లుగా ట్రోల్స్ చేశారు.
అసత్యపు ప్రచారం హోరెత్తించారు. ఓ నాయకుడు అయితే బాణాసంచా కల్చి సంబరాలు జరిపి ఆ తర్వాత ముక్కున వేలు వేసుకున్నాడు. విశాఖ జిల్లా పీఎం పాలెం లో జీవీఎంసీ 6వ వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు గొల్లంగి అనందబాబు తదితరులు ఆదివారం సాయంత్రం ఆయిదు గంటలకే బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చిందని తెలియడంతో తెలుగు తమ్ముళ్లు చేసిన పనికి ముక్కున వేలేసుకున్నారు.