Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ను ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబును సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టు లో హజరుపర్చగా, రిమాండ్ రిపోర్టుపై ఇరుపక్షాల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా, సీఐడీ తరపున ప్రభుత్వ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించాయి. చివరకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రభుత్వ వాదనలకు ఏకీభవిస్తూ 14 రోజులు రిమాండ్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో చంద్రబాబు ను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు.
దీంతో శుక్రవారం రాత్రి మొదలైన హైడ్రామా 48 గంటల తర్వాత తెరపడింది. ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్టును రిజక్ట్ చేసి చంద్రబాబుకు వెంటనే బెయిల్ మంజూరు చేస్తారని భావించిన టీడీపీ శ్రేణులకు భంగపాటు ఎదురైంది, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో రూ.279 కోట్లు దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలతో చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు అందుకు సంబంధించి పలు ఆధారాలను కోర్టు ముందు ఉంచారు.
చంద్రబాబు అరెస్టులో అధికారులు ప్రొసీజర్ ఫాలో కాలేదనీ, ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేకపోయినా అరెస్టు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో 37వ నిందితుడుగా పేర్కొన్నారనీ, ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ వర్తించదని ఇలా పలు వాదనలు చంద్రబాబు తరపున న్యాయవాది వినిపించినా ఏసీబీ కోర్టు .. సీఐడీ వాదనలకు ఏకీభవించి రిమాండ్ విధించింది. అయితే పిటిషనర్ తరపు విజ్ఞప్తి మేరకు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది.
చంద్రబాబు అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. అయితే ఈ అంశంపై విదేశీ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ కు వివరాలు తెలియజేయగా, అవినీతికి పాల్పడిన వాళ్లను జైలుకు తరలించకుండా ముద్దు పెట్టుకుంటారా అన్నట్లు కామెంట్స్ చేశారుట. ఏసీబీ కోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు బలంగా వినిపించిన న్యాయవాద బృందాన్ని కూడా అభినందించారుట. ఏది ఎలా ఉన్నా ప్రతిపక్ష నేతకు సెంట్రల్ జైలులో ప్రత్యేక వసతులు కల్పించి పటిష్ట భద్రతా ఏర్పాటు చేయాలని చెప్పినట్లుగా సమాచారం.
Chandrababu: చంద్రబాబు హౌజ్ రిమాండ్ పిటిషన్ పై తీర్పు వాయిదా