Road Accident: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ఎందరో బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం. ఆ డ్రైవర్ మరణించిన తర్వాత అంబులెన్స్ కూడా ప్రమాదానికి గురై దగ్ధం అయ్యింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం వద్ద ఇవేళ వేకువజామున జరిగింది. వివరాల్లోకి వెళితే.. మలక్ పేటకు చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్న బీఎన్ రెడ్డి ఓ రోగికి సీరియస్ గా ఉండటంతో వారిని ఆసుపత్రిలో దించి వెళుతున్న క్రమంలో హస్తినాపురం వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి బొల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్ ను బయటకు తీశారు.
అయితే తీవ్రంగా గాయపడిన అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బొల్తా పడిన అంబులెన్స్ ను తొలగించే ప్రయత్నం చేయగా అందులోని ఆక్సిజన్ సిలెండర్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేశారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికే అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. ఆక్సిజన్ సిలెండర్ పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల ప్రజలు ఏమి జరిగిందో తెలియక భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. బయటకు వచ్చి చూడగా అంబులెన్స్ దగ్ధం కావడం చూసి షాక్ కు గురైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్ డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
YSRCP: విజయసాయి రెడ్డికి పార్టీలో మరో కీలక పదవి ..మాజీ మంత్రి బాలినేనితో భేటీ ఎందుకంటే..?
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!