AP Assembly: పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై విచారణ జరిపేందుకు హౌస్ కమిటీ వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. సోమవారం అసెంబ్లీలో పెగాసస్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. అధికారపక్ష సభ్యుల డిమాండ్ తో హౌస్ కమిటీ వేస్తున్నామని స్పీకర్ ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ హౌస్ కమిటీ విచారణ చేపడుతుందని తెలిపారు. దీనికీ సంబంధించి కమిటీ సభ్యులను రేపు లేదా ఎల్లుండి ప్రకటిస్తామన్నారు. పెగాసస్ స్పైవేర్పై చర్చలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. పెగాసస్ వంటి స్పైవేర్తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందన్నారు. ఇది ప్రమాదమే కాదు.. అనైతికమని కూడా అన్నారు. చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నారని స్వయం గా బెంగాల్ సీఎం మమతా చెప్పారన్నారు.
ఈ స్పైవేర్తో వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్గానే చేస్తారని విమర్శించారు. చంద్రబాబు చేసిన ఈ చర్య.. మానవహక్కులకు భంగం కలిగించడమేనని అన్నారు. పెగాసస్ను కొనడం.. ఘోరమైన నేరమన్నారు. చంద్రబాబుకు అడ్డదారి రాజకీయాలు మాత్రమే తెలుసని అన్నారు. పెగాసస్ను చంద్రబాబు రాజకీయనేతలపై ఉపయోగించారని అన్నారు. 2016లో పెగాసస్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ప్రమాదకర సాఫ్ట్వేర్ను చంద్రబాబు కొన్నారంటే ఎంత దుర్మార్గం అని తెలిపారు. పెగాసస్తో ఏం చేశారో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
సేవామిత్ర యాప్ ద్వారా కూడా టీడీపీ.. ఓటర్లపై నిఘా పెట్టిందని మంత్రి బుగ్గన ఆరోపించారు. వైసీపీకి అనుకూలంగా ఉండేవారి ఓట్లను తొలగించారని అన్నారు. ఆధార్ డేటా సేకరించి ఏ ఓటర్ ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకునే యత్నం జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. గతంలో వైసీపీ నేతలతో పాటు, తన ఫోన్ ట్యాంపర్ అయిందని తెలిపారు. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పారు. ఇది రాజ్యాంగానికి విఘాతం కలిగించే చర్య అని సజ్జల అన్నారని గుర్తుచేశారు. పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యే లు పెగాసస్ పై విచారణ కు హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి బుగ్గన ప్రతిపాదన మేరకు హౌస్ కమిటీ వేయనున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తొలుత పెగాసస్ పై సభలో చర్చ చేపట్టడం సరికాదు అంటూ టీడీపీ స్పీకర్ కు లేఖ ఇచ్చింది. అవాస్తవాలపై సభలో చర్చించటం విడ్డూరం టిడిపి సభ్యులు పేర్కొన్నారు.