ఏపీ సీఎం వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో ఎవరైనా బాధితులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలను వివరిస్తే వెంటనే ఆర్ధిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో ఓ క్యాన్సర్ బాధితురాలు తన సమస్యను విన్నవించడంతో చలించిపోయారు. వెంటనే రూ.3లక్షల ఆర్ధిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
విజయనగరం జిల్లా కొండదాడికి చెందిన సరస్వతి అనే మహిళ హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్ ను కలిసి తన కష్టాలను చెప్పుకుంది. తన తల్లిదండ్రులు ఇద్దరూ క్యాన్సర్ తో మృతి చెందారనీ, తను కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నానని, ఆసుపత్రి, ఇతరత్రా ఖర్చులకు ఇబ్బంది పడుతున్నానని, ఆదుకోవాలని వేడుకుంది. ఆమె బాధ విని చలించిపోయిన సీఎం జగన్ .. వెంటనే రూ.3లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. రూ.3 లక్షల మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అందించాలని కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రూ.3లక్షల చెక్కును సిద్దం చేయగా, సాయంత్రానికి మంత్రి బొత్స సత్యనారాయణ బాధితురాలికి అందజేశారు. సీఎం జగన్ మానవతా దృక్పదంతో క్యాన్సర్ బాదితురాలికి సాయపడ్డారని మంత్రి బొత్స తెలిపారు. ఈ సందర్భంగా బాధితురాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం జగన్ తన దొడ్డ మనసును మరో సారి చాటుకున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.
టీటీడీ నూతన బోర్డు సభ్యులు వీరే ..