YS Jagan: రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు సీఎం వైఎస్ జగన్. సబ్ స్టేషన్ లు లేక ఇబ్బంది పడుతున్న వారి కష్టాలు తీరనున్నాయన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో మొదటి సారి ఒకే సారి 28 సబ్ స్టేషన్లకు ఏపీ ట్రాన్స్ మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్ కో) శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వర్చువల్ పద్దతిలో 16 సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన చేయడంతో పాటు 12 సబ్ స్టేషన్ లకు ప్రారంభోత్సవాలు చేశారు. అలానే కడపలో 750 మెగావాట్లు సామర్ధ్యం, అనంతపురంలో 100 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు సీఎం జగన్.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇవేళ ప్రారంభించిన సబ్ స్టేషన్ లను స్థానికులకే అంకితం చేస్తున్నామన్నారు. రైతులకు పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయంచామని తెలిపారు. 14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. గోదావరి వరదల సమయంలో చింతూరు, వీఆర్ పురం, ఏటపాక తదితర ముంపు ప్రాంతాల్లో ఇటీవల తాను పర్యటించిన సమయంలో సబ్ స్టేషన్ లు లేకపోవడం వల్ల వారు పడుతున్న ఇబ్బందులు ప్రజలు తెలియజేశారన్నారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ అక్కడి సబ్ స్టేషన్ లను ఈరోజు ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు.
ట్సాన్స్ మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ నాణ్యమైన విద్యుత్ ప్రతి గ్రామంలోని రైతులకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్ చేస్తున్నామన్నారు.రూ.1700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. ఉచిత విద్యుత్ స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4 లకే యూనిట్ ధరతో సెకీతో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. మరో రెండున్నర దశాబ్దాల పాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్ ఇవ్వవచ్చని, దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందని సీఎం వివరించారు. దాదాపు రూ.3099 కోట్లు సబ్ స్టేషన్ ల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. రూ.3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్ పవన్ కు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. సోలార్ ప్రాజెక్టు వల్ల 1700 ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు.