YS Jagan: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పని చేస్తున్న వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్లకు బహుమానం ప్రకటిస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 1 నుండి వాలంటీర్లకు గౌరవ భృతి రూ.5 వేల నుండి రూ.5,750కి పెంచుతున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారనీ, అందుకే రాష్ట్రంలో జగన్ పాలన పోవాలని అంటున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు.
ప్రతిపక్ష నేతలు అడ్డుపడుతున్నా మరో సారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు మంత్రి కారుమూరి. రాష్ట్రంలోని వాలంటీర్లు ఇకపై వారి పరిధిలోని లబ్దిదారులు అందరికీ ఎండియుల ద్వారా రేషన్ పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. వాలంటీర్లకు పెరిగిన గౌరవ వేతనం జనవరి నుండి ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద వర్గాలకు నేరుగా అందించేందు గానూ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 50 నుండి 75 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకూ రూ.5వేల గౌరవ వేతనంతో వీరు విధులను నిర్వహిస్తున్నారు.
Dinosaur Eggs: మధ్యప్రదేశ్ లో వండర్ .. కులదేవతగా డైనోసార్ గుడ్లకు పూజలు