Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఫైబర్ గ్రిడ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నోటీసుల్లో నిబంధనలను సవాల్ చేస్తూ మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ను అరెస్టు చేస్తారన్న ఆందోళన తమకు ఉందని లోకేష్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
అయితే లోకేశ్ ను ఇంత వరకూ ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ఒక వేళ నిందితుడిగా చేరిస్తే ఆయనకు సీఆర్పీసీలోని 41 ఏ కింద నోటీసులు ఇస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. 41ఏ నిబంధనలు పాటించకపోతే న్యాయస్థానానికి విన్నవిస్తామని లోకేష్ తరపు న్యాయవాది చెప్పారు. దీంతో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ ముగించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41ఏ నోటీసులు జారీ చేయడం, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో హైకోర్టు నుండి మధ్యంతర బెయిల్ మంజూరు చేసి ఉండటంతో లోకేష్ అరెస్టు భయం నుండి బయటపడినట్లు అయ్యింది.
ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణను అక్టోబర్ 10వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 4వ తేదీ విచారణకు హజరు కావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 41 ఏ నోటీసులో నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. హెరిటేజ్ సంస్థలో లోకేశ్ షేర్ హోల్డర్ అని, ఆయనకు తీర్మానాలు ఇవ్వాలన్నా, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇవ్వాలన్నా కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని ఆయన తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు న్యాయస్థానంకు వివరించారు. లోకేశ్ ను ఇవి సీఐడీ అడగడం సమంజసం కాదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమనీ, బుధవారమే (4వ తేదీ) విచారణకు హజరు కావాలని సీఐడీ తరపు న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన పోసాని అంత తొందరేముందని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం అక్టోబర్ 10వ తేదీన సీఐడీ విచారణకు లోకేశ్ హజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. 10వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాదిని అనుమతించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Pawan Kalyan: వైసీపీ సర్కార్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు