AP High Court: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. అయ్యన్నపై తాజాగా నమోదు అయిన కేసుల్లో తదనంతర చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయ్యన్నపాత్రుడిపై పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కేసు నమోదైంది. సీఎం వైఎస్ జగన్ ను దూషించారన్న అభియోగంపై అయ్యన్న మీద 506 (2), 153(ఏ), 506 సెక్షన్ కింద కేసు నమోదైంది. రామకృష్ణ అనే వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుపై నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
AP High Court: అయ్యన్న కేసులో స్టే
నిన్న పెద్ద ఎత్తున పోలీసులు అయ్యన్నపాత్రుడికి ఇంటికి చేరుకోవడంతో అరెస్టు చేస్తారని భావించారు. అయ్యన్న అరెస్టును అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చిన సమయంలో అయ్యన్న ఇంట్లో లేకపోవడంతో వచ్చే వరకూ వేచి ఉంటామని పోలీసులు చెప్పి అక్కడే ఉండిపోయారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు నోటీసులు అందించి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల చర్యలపై హైకోర్టులో అయ్యన్నపాత్రుడు తరపు న్యాయవాది సతీష్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.