Corona vaccine: ఏపికి ఇంతకు ముందు వచ్చిన కరోనా వ్యాక్సిన్ లు నిండుకోవడంతో గత కొద్ది రోజులుగా ప్రజలు వ్యాక్సిన్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల క్రితం మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న రెండవ డోసు కోసం తీసుకునేందుకు ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే వ్యాక్సిన్ కేంద్రాలకు వెళితే నోస్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వెనుతిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం స్పందించింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాక్సిన్స్ ల ఆవశ్యకతను వివరించారు. అదే విధంగా కేంద్రానికి ఏపి సీఎం జగన్ లేఖ కూడా రాశారు.
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో గన్నవరంకు 4లక్షల 40వేల కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్స్ చేరుకున్నాయి. రేపు ఉదయం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి రెండు లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ రానున్నాయి. ఈ రోజు 37 బాక్సుల్లో వచ్చిన 4లక్షల 40వేల వ్యాక్సిన్ లను నేరుగా గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ కు తరలించారు. అనంతరం అక్కడ నుండి రేపు ఉదయానికల్లా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు తరలించనున్నారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్రానికి రాసిన లేఖకు స్పందించి 24 గంటల్లోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ పంపినందుకు మరో మారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. 45 దాటిన ప్రతి ఒక్కరికీ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ కరోనా కట్టడికి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్స్, ఆశ వర్కర్ల సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి నాని పేర్కొన్నారు.