బీజేపీ నేత సత్యకుమార్ కారుపై మందడంలో మూడు రాజధానుల మద్దతు శిబిరం వద్ద రాళ్ల దాడి జరిగింది. అమరావతి రాజధాని మద్దతుగా ఉద్యమం చేపట్టి 1200 రోజులు అయిన సందర్భంగా అమరావతి రైతులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నేతలు సత్యకుమార్, ఆదినారాయణ రెడ్డితో సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులు ఉద్యమానికి బీజేపీ మద్దతు పలుకుతోందని తెలిపారు. అనంతరం ఆయన తుళ్లూరులోని పార్టీ నాయకుల పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా మందడంలోని మూడు రాజధానుల మద్దతు శిబిరం వద్ద పలువురు రాళ్ల దాడి చేశారు. దీంతో సత్యకుమార్ కారు అద్దాలు పగిలిపోయాయి.

బీజేపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొనడంతో అక్కడ మొహరించి ఉన్న పోలీసులు బీజేపీ నేతలను అక్కడ నుండి పంపించి వేశారు. సత్యకుమార్ కారుపై జరిగిన దాడిని ఆ పార్టీ నేతలతో పాటు పలు పార్టీల నేతలు ఖండించారు. అనంతరం సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. తన వాహనంపై వైసీపీ గుండాలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు నిలువరించలేకపోయారన్నారు. దీనికి సీఎం జగన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ అంశంపై పార్టీలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని సత్యకుమార్ పేర్కొన్నారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ..వైఎస్ఆర్టీపీ కార్యకర్తలతో సహా వైఎస్ షర్మిల అరెస్టు