Badvel Bypoll: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన, టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దివంగత వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధ పోటీ చేస్తున్న నేపథ్యంలో మావతా దృక్పదంతో సంప్రదాయాన్ని అనుసరించి పోటీకి దూరంగా ఉండాలని తొలుత జనసేన, ఆ తరువాత టీడీపీ నిర్ణయించుకుని పోటీ నుండి ఉప సంహరించుకున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించగా, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ పొలిట్ బ్యూరోలో దీనిపై చర్చించి నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే కుటుంబ రాజకీయాలకు దూరమన్న బీజేపీ సిద్ధాంతం ప్రకారం తాము అభ్యర్థిని బరిలో దింపుతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. బద్వేల్ బరిలో పోటీకి నిలపాలన్న బీజేపీ రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని కేంద్ర అధిష్టానం ఆమోదిస్తుందా తిరస్కరిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీ పోటీ చేయకుండా ఉంటే వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన నవతరం పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ కూడా ప్రధాన పార్టీలు పోటీ చేయకుండా ఉంటే ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇదే విషయాన్ని తెలియజేశారు. వైసీపీ నుండి ఏకగ్రీవ ప్రతిపాదన వచ్చి ఉంటే బాగుండేదని ముందే పేర్కొన్నారు.
Badvel Bypoll: కేంద్ర బీజేపీ వైఖరేమిటి..?
ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే బీజేపీ కేంద్ర నాయకత్వం వైసీపీకి అనుకూలంగా ఉందా లేదా అనేది ఇప్పడు స్పష్టం అవుతోంది. వైసీపీ – బీజేపీ రాజకీయాలపై రాష్ట్రంలో కుస్తీ, కేంద్రంలో దోస్తీ అనే ఆరోపణలు చాలా కాలంగా విమర్శలు వినబడుతున్నాయి. అమరావతి రాజధాని విషయంలోనూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం తొలుత అమరావతి రైతాంగానికి మద్దతు తెలియజేశారు. అమరావతిలోనే రాజధాని కొనసాగాలంటూ ఏపీ బీజేపీ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందంటూ విమర్శలు వచ్చాయి.
కీలకం కానున్న కేంద్ర బీజేపి నిర్ణయం
ఓ పక్క రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఆందోళనలు చేస్తుంది, తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. రాష్ట్ర బీజేపీని వైసీపీ ప్రతి విమర్శలు చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వంతో జగన్ ప్రభుత్వం సఖ్యతగానే వ్యవహరిస్తూ వస్తోంది. ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదం సమయంలో ఎన్ డీఏ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ తరుణంలో బద్వేల్ ఉప ఎన్నికల విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపై కేంద్ర బీజేపీ నాయకత్వం తీసుకునే నిర్ణయం కీలకం కాబోతున్నది. ఇటీవల కాలం వరకూ బీజేపీ నేత జీవిఎల్ నర్శింహరావు లాంటి నేతలు కేంద్ర ప్రభుత్వం వేరు, బీజేపీ వేరు అంటూ అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కేంద్ర బీజేపీ నాయకత్వం బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించిన అంశంలో తీసుకునే నిర్ణయంతో వైసీపీపై వారి స్టాండ్ ఏమిటి అనేది అర్ధం అవుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.