Budget 2022: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పలు రంగాలకు ప్రోత్సాహాకాలను వివరిస్తున్న మంత్రి నిర్మల ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు చేయూతనిచ్చేలా ఓ మాట చెప్పారు. వందల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల కోసం పంపిణీ చేస్తున్న ఏపి సర్కార్ కు ఇది శుభ వార్తే. ప్రతి నెలా అప్పులు, కేంద్ర నిధులు రాకుంటే తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొనే ఏపికి ఇది పెద్ద ఊరట.
Budget 2022: వడ్డీ రహిత రుణాలు
రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇస్తామంటూ మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. లక్ష కోట్ల వడ్డీలేని రుణాల అందజేతకు సుముఖత వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్రాలకు ఆర్ధిక సాయం కింద లక్ష కోట్లతో నిధి కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా డిజిటల్ కరెన్సీని ఈ ఏడాదే విడుదల చేస్తామని కూడా చెబుతున్నారు. త్వరలోనే డిజిటల్ రూపాయిని ఆర్ బీ ఐ విడుదల చేస్తుందని అంటున్నారు.
సహకార సంఘాలకు సర్ చార్జి తగ్గింపు
రాబోయే మూడు సంవత్సరాల్లో వంద కార్గో టెర్మినల్స్ ను ఏర్పాటు చేస్తామని నిర్మల తెలిపారు. అతిథ్య రంగం పునరుజ్జీవం కోసం కృషి చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో అదనంగా రూ.2లక్షల కోట్ల క్రిడిట్ సదుపాయం కల్పిస్తామని అన్నారు. స్టార్టప్ కంపెనీలకు పన్ను రాయితీని మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. కోటి నుండి పది కోట్ల వరకు ఆదాయం గల సహకార సంఘాలకు సర్ చార్జిని 7 శాతంకు తగ్గించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించేలా ప్రకటన చేశారు. వచ్చే అయిదేళ్లలో దేశ వ్యాప్తంగా 60 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. అయితే గతంలోనూ ఇదే మాదిరిగా మోడీ ప్రకటన చేసి నిరుద్యోగులను మోసం చేశారనే విమర్శ ఉంది.