ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ మూడవ సారి ఎన్నికల బరిలో నిలవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బుగ్గనతో పాటు పలువురు సీనియర్ నేతలు ఇంతకు ముందు తమ వారసులకు రాబోయే ఎన్నికల్లో టికెట్ లు ఇవ్వాలని సీఎం జగన్ ను కలిసి పలుమార్లు విన్నవించారు. తాము రాజకీయంగా రిటైరైపోతామని వీరిలో కొందరు చెప్పేశారు. కానీ, ఈ సారి వారసులకు టికెట్లు ఇచ్చేది లేదు.. మీ వారసులను నియోజకవర్గాల్లో తిప్పండి కానీ ఈ ఎన్నికల్లో మీరే పోటీ చేయాలని అంటూ అప్పట్లో వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు జగన్.
కానీ .. వారి ఒత్తిడికి జగన్ కాస్త మెత్తబడ్డారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)కి, రామచంద్రాపురం అసెంబ్లీ టికెట్ ను రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ కు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తాఫా కుమార్తె నూరి ఫాతిమా కు ఆయా నియోజకవర్గాల ఇన్ చార్జిగా జగన్ నియమించారు.
అయితే ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని గతంలో కోరారు. కానీ.. జగన్ డోన్ విషయంలో ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. వారసులకు టికెట్ ఇవ్వాలని కోరిన దాదాపు అందరు నేతల అభ్యర్ధనలకు సానుకూలంగా స్పందించిన జగన్ .. డోన్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో మరల బుగ్గనే బరిలో నిలవాల్సి వస్తొంది.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గం నుండి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 లో 11వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ తో గెలిచిన బుగ్గన..2019 ఎన్నికల్లో ఏకంగా 35వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. రెండు సార్లు కూడా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రతాప్ పై విజయం సాధించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
YSRCP: దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..!