YSRCP: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న పలు సాహసోపేత నిర్ణయాలు సీనియర్ లను సైతం విస్మయాన్ని కల్గిస్తున్నాయి. జగన్ .. జగమొండి అని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు ఎన్ని అనుకున్నా విమర్శలు వస్తున్నా తాను చేయాలనుకున్న పని చేసుకోని పోవడం జగన్ నైజంగా కనబడుతోంది. అంతటి ధైర్యం, తెగింపు ఏ రాజకీయ పార్టీకి ఉండవు అని చెప్పవచ్చు.
ఎందుకంటే.. సీనియర్ నేతలైన చంద్రబాబు, కేసిఆర్ లాంటి వాళ్లు అభ్యర్ధుల ఎంపిక విషయాల్లో కొంత భయపడి సీనియర్ ల విషయంలో రాజీ పడే పరిస్థితి ఉండేది. సీనియర్ లు తిరుగుబాటు చేస్తారేమో అని భయపడేవారు. గత ఎన్నికల సమయంలో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, 40 శాతంకుపైగా సిట్టింగ్ లు మార్చాలని కూడా సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డి చంద్రబాబుకు బహిరంగంగానే సూచించారు. కానీ చంద్రబాబు ఆ ధైర్యం చేయలేకపోయారు. చివరకు ఎన్నికల ప్రచార సభల్లో తనను చూసి టీడీపీ అభ్యర్ధులకు ఓటు వేయాలని కూడా చంద్రబాబు అభ్యర్ధించారు.
అలానే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ దాదాపు సిట్టింగ్ లు అందరికీ టికెట్ లు కేటాయించారు. కేవలం అయిదారుగురుని మాత్రం టికెట్లు ఇవ్వలేదు. అధికార పార్టీలో సిట్టింగ్ లకు టికెట్ లు ఇవ్వకపోతే వారు తిరుగుబాటు చేస్తే కొంత మేర నష్టం వాటిల్లుతుందన్న భయం ఉంటుంది. కానీ .. జగన్ మాత్రం వ్యూహాత్మకంగా, ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. సీనియర్ లు సైతం ముక్కున వేలువేసుకునేలా తన నిర్ణయాలు ఉన్నాయి.
గెలుపే లక్ష్యంగా సర్వేల ఆధారంగానే టికెట్ లు కేటాయిస్తాననీ, ఇందులో మొహమాటాలకు తావు ఉండదు అని జగన్ గతంలో పలు సందర్భాల్లోనూ చెప్పారు. ఇప్పుడు ఆ పని చేసి చూపిస్తున్నారు. ఎన్నికలకు పది రోజుల ముందు టికెట్ లను కన్ఫర్మ్ చేస్తే వారు ఏ పార్టీలోకి వెళ్లినా పెద్దగా రాజకీయంగా నష్టం ఉండదు. కానీ మూడు నెలలకు ముందే జగన్ ఇటువంటి సాహసం చేస్తున్నారు అంటే దటీజ్ జగన్ అనాల్సిందేనంటున్నారు. మూడు నెలలకు ముందే వరుసగా ఇన్ చార్జిలను ప్రకటిస్తూ జగన్ సంచలనానికి తెరలేపారు. అయితే కొత్తగా టికెట్ లు దక్కిన వారు గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే ఇది మాత్రం గొప్ప ప్రయోగమేనని అంటున్నారు.
మొదటి జాబితాలో 11 మంది ఎమ్మెల్యేలకు స్థాన చలనం కల్పించారు. మంత్రులను సైతం పక్కన పెట్టారు. రెండో జాబితాలో 27 మంది ఇన్ చార్జిలను ప్రకటించారు జగన్. వీరిలో 16 మంది కొత్త వారు ఉండటం విశేషం. రిజర్వుడ్ స్థానాలతో పాటు అనేక కీలక నియోజకవర్గాల్లోనూ నేతలను మార్చేస్తున్నారు. తొలి జాబితాలో తనకు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికే టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఆ నేపథ్యంలో అతను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన కోసం రాయబారం కూడా చేయలేదు. దీంతో జగన్ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఎవరి మాటా వినరు, రాజీ పడరు అనే సంకేతం ఇచ్చారు.
పార్టీ నుండి అలిగి బయటకు వెళ్లే వారి గురించి పెద్దగా పట్టించుకోవడం కూడా చేయడం లేదు. ఇప్పటి వరకూ తనకు వ్యతిరేకంగా గళం విప్పని వారు ఇప్పుడు మాట్లాడుతున్నా డోంట్ కేర్ అన్నట్లుగా అభ్యర్ధులను ఎడాపెడా మార్చేస్తున్నారు. జగన్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలే పార్టీ గెలుపునకు శ్రీరామ రక్ష అవుతుందని భావిస్తున్నారు. అభ్యర్ధులను చూసి కాదనీ, జగన్ ను చూసే వైసీపీకి ప్రజలు ఓట్లు వేస్తారని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
YS Jagan Sharmila: చాలా రోజుల తర్వాత అన్నతో చెల్లి భేటీ .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే ..?