NTR-Jagan: పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు మధ్య యుద్ధం మొదలైంది. పీఆర్సీపై ప్రభుత్వం గత వారం జీఓ విడుదల చేయడం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. దీంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేశారు. కలెక్టరేట్లు ముట్టడించారు. ప్రభుత్వం పీఆర్సీపై వివరించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. మొత్తంగా సమ్మెకు వెళ్లేందుకే నిర్ణయించారు. అయితే.. ఉద్యోగుల నుంచి వచ్చిన నిరసనలతో ప్రభుత్వం పీఆర్సీపై పునరాలోచిస్తుందనే అందరూ భావించారు. కానీ.. క్యాబినెట్ భేటీలో పీఆర్సీని ఆమోదించడంతో చిచ్చు మరింత రగిలింది. దీంతో ఉద్యోగ సంఘాలు తమ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నాయి.
ఉద్యోగుల కార్యాచరణ..
జనవరి 23న రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, 24న సీఎస్ కు సమ్మె నోటీసు ఇవ్వడం, 25న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 26న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వడం, 27 నుంచి 30 వరకూ రిలే దీక్షలు, ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ, ఫిబ్రవరి 5న సహాయ నిరాకణ, ఫిబ్రవరి 7 నుంచి సమ్మె ప్రారంభం.. ఇదీ ఉద్యోగుల కార్యాచరణ. నిజానికి ఉద్యోగుల సమ్మెతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. చట్టాలు ఏం చెప్తున్నాయి..? కోర్టులో నిలబడతాయా..? అనేవి ప్రస్తావనార్హం. రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యోగులు 47 రోజులపాటు సకలజనుల సమ్మె చేశారు. ఇప్పుడు జీతాల కోసం (NTR-Jagan) ఏపీ ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నారు. పీఆర్సీ, ఫిట్ మెంట్, ఎరియర్స్, డీఏ కోసం డిమాండ్ చేస్తే కోర్టు అంగీకరించదు.. హెచ్ఆర్ఏ కోసం తప్ప.
పరిష్కారం ఎప్పుడు..
ముందుగా ఈ విషయం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. ఎవరికి వారు తమ వాదనలు వినిపించి తీర్పు రావడానికి సమయం పట్టొచ్చు. అందుకే.. సాధ్యమైనంత వరకూ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలతో ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశాలే ఎక్కువ. 1986లో అప్పటి సీఎం ఎన్టీఆర్ హయాంలో పీఆర్సీపైనే ఉద్యోగులు 19 రోజులపాటు సమ్మె చేశారు. స్వయంగా (NTR-Jagan) ఎన్టీఆర్ ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించారు. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం పీఆర్సీపై వెనక్కి తగ్గేది లేదని తేల్చేసింది. ఉద్యోగ సంఘాలు తగ్గడం లేదు. దీంతో సమస్య పరిష్కారం ఎలా..? పరిష్కరించేది ఎవరు..? ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే..!