Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నెల 24వ వరకూ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు వెల్లడించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయి రాజమహేంద్రవరం (రాజమండ్రి) సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబు రిమాండ్ గడువు ముగియడంతో ఆయనను పోలీసులు ఏసీబీ కోర్టులో వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హజరుపర్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయాన్ని న్యాయమూర్తి కోరారు.
తనను రాజకీయ కక్షతోనే జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని న్యాయమూర్తితో చంద్రబాబు చెప్పారు. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారనీ, తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని చంద్రబాబు అన్నారు. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని కోరారు. తనను అక్రమంగా అరెస్టు చేశారనీ, ఇదే తన బాధ, ఆవేదన, ఆక్రందన అని చంద్రబాబు అన్నారు. తనపై ఉన్నది ఆరోపణలు మాత్రమేననీ, నిర్ధారణ కాలేదన్నారు. చట్టానికి అందరూ సమనానమే, చట్టాన్ని గౌరవిస్తానని చంద్రబాబు అన్నారు. హక్కులు, రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని చంద్రబాబు కోరారు.
మీరు పోలీసు కస్టడీలో లేరు. జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నారని పేర్కొన్న జడ్జి .. మీరు దీన్ని శిక్ష గా భావించవద్దని చంద్రబాబుతో అన్నారు. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే.. నేర నిరూపణ కాలేదు. చట్టం, నిబందనల ప్రకారమే మీకు రిమాండ్ విధించామని న్యాయమూర్తి అన్నారు. జైలులో సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ సౌకర్యాలు అవసరమైతే దానికి అనుగుణంగా ఆదేశాలు ఇస్తామని జడ్జి చంద్రబాబు అన్నారు. మీరు 24వరకు జ్యూడిషియల్ కస్టడీలోనే ఉంటారని చెప్పారు. మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది. మీ తరపు న్యాయవాదులు కస్టడీ అవసరం లేదని వాదించారు. చట్టం ముందు అందరూ సమానమే అని జడ్జి పేర్కొన్నారు.
మరో పక్క చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇవేళ మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పు వెల్లడించనున్నది. దీంతో చంద్రబాబు సీఐడీ కస్టడీపైనా ఏసీబీ కోర్టు తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ ఈ నెల 9వ తేదీన అరెస్టు చేసింది. ఆ మరుసటి రోజు వేకువజామున ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు చంద్రబాబును హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు.
AP Assembly: మరో ముగ్గురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్