YS Jagan: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో హైదరాబాద్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. గౌతమ్ రెడ్డి మృతితో ఏపిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన స్వస్థలమైన నెల్లూరు జిల్లాలో అభిమానులు గౌతమ్ రెడ్డి మరణవార్త విని కన్నీరు పెట్టుకున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు, ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు తరలివస్తున్నారు. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన భార్య భారతి కొద్దిసేపటి క్రితం మేకపాటి నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి మరణవార్త తెలియడంతో జగన్మోహనరెడ్డి తీవ్ర దిగ్భాంతికి గురైయ్యారు. ప్రత్యేక విమానంలో జగన్ హైదరాబాద్ కు వెళ్లారు.
YS Jagan: భావోద్వేగానికి గురైన జగన్
జగన్ దంపతుల రాకతో మేకపాటి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జగన్ తో గౌతమ్ రెడ్డి అత్యంత సన్నిహితుడుగా మెలగిన క్షణాలను గుర్తు చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు జగన్ రావడంతో ఒక్క సారిగా తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యుల రోదనలను చూసిన జగన్ కూడా భావోద్వేగానికి గురైయ్యారు. గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డిని జగన్ ఓదార్చగా, జగన్ సతీమణి వైఎస్ భారతి గౌతమ్ రెడ్డి తల్లి, సతీమణిని ఓదార్చారు.
ఎల్లుండి అంతిమ సంస్కారాలు
కాగా అమెరికాలో చదువుకుంటున్న గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి యుఎస్ నుండి బయలు దేరాడు. రేపు ఉదయం గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని వారి స్వగ్రామం నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లికి తరలిస్తారు. గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి చెన్నై మీదుగా నెల్లూరుకు చేరుకుంటారు. అర్జున్ రెడ్డి వచ్చిన తర్వాత ఎల్లుండి అధికార లాంఛనాలతో బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.