YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కెరీర్లో కీలకమైన అంశం. ఆయన సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి వేగం పెంచింది. వివేకా హత్య కేసు రాజకీయంగా పలు విమర్శలకు తోడవ్వడంతో పాటు వివేకా కుమార్తె సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కేసు వేగవంతం చేయాలని కోరడం చూస్తుంటే త్వరలోనే సీబీఐ బృందం దోషులను నిర్ధారించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే … ఏపీ సీఎం పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు చెక్ పడ్డట్లే.
అసలేం జరిగింది?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో సీబీఐ విచారణతోనే దోషులు తేలుతారని భావించారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు వివేకా సన్నిహితులతో పాటు కీలక వ్యక్తులను విచారణ చేశారు. సీబీఐ విచారణలో భాగంగా పులివెందులకు చెందిన పలువురు కీలక వ్యక్తులను విచారణ చేసి హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అయితే, సీబీఐ బృందంలో పలువురికి కరోనా సోకడంతో మధ్యలో విచారణకు బ్రేక్ పడింది. అయితే, వివేకా కూతురు సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మళ్లీ విచారణ జోరుగా సాగుతోంది.
ఇప్పుడు మళ్లీ విచారణ
తాజాగా విచారణలో భాగంగా పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వివేకా సన్నిహితులతో పాటు కీలక వ్యక్తులను విచారణ చేశారు. పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం ఆర్ అండ్ బి గెస్ట్ లో మకాం వేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి సమీపంలో ఉన్న పాల డైరీ వ్యాపారులతో పాటు ఓ సెల్ పాయింట్ నిర్వాహకుడిని కూడా సీబీఐ బృందం ప్రత్యేకంగా విచారణ చేసింది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్ రెడ్డి కి చెందిన సెల్ ఫోన్ రిపేర్ నిమిత్తం సెల్ పాయింట్ లో గతంలో ఇచ్చాడని అందుకు కారణంగానే సెల్ పాయింట్ నిర్వాహకుడిని విచారణ చేసినట్లు తెలుస్తోంది. గతంలో సీబీఐ విచారణకు హాజరైన వారిని సైతం మరోసారి విచారణకు పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేస్తారని సమాచారం. ఇలా ఇక చివరి సారి అంటే సీబీఐ విచారణలో త్వరితగతిన కేసులో దోషులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే తెలుస్తోంది.