సార్వత్రిక ఎన్నికలు మరో పది నెలల్లో రానుండటంతో రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు ఇప్పటి నుండే కదనరంగంలోకి దిగుతున్నాయి. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు జనాల్లో తిరుగుతూ మద్దతు కోరుతున్నాయి. దీంతో ఏపీలో ఎన్నికల హడావుడి ప్రారంభమైనట్లుగా కనబడుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ముందుగా ఏపిలోని 175 నియోజకవర్గాలకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఇఓ) ముఖేశ్ కుమార్ మీనా గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాలకు ఆర్ఓల నియామకం చేశారు సీఈఓ. ఈ గెజిట్ నోటిఫికేషన్ జారీతో ఎన్నికల ప్రక్రియలో తొలి అంకాన్ని ప్రారంభించినట్లు అయ్యింది.
మరో వైపు ఏపిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – 2024 పై సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్ లతో కేంద్ర ఎన్నికల సంఘం విశాఖలో సమావేశం నిర్వహించింది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటి కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటి కమిషనర్ హిర్దేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా తయారీ సహా ఎన్నికలకకు సంబంధించి విధుల్లో వాలంటీర్లు పాల్గొంటున్నట్లు వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావించారు. రాష్ట్రంలో జీరో డోర్ నెంబర్ తో భారీగా ఓట్లు ఉండటంపైనా ప్రశ్నించగా, ఇంటి నెంబర్ లేని వారి ఓట్లను జీరో ఇంటి నెంబర్ పై నమోదు చేయడం జరిగిందని అధికారులు వివరణ ఇచ్చారు.
ఇదే క్రమంలో ఒకే ఇంటి నెంబర్ లో ఎక్కువ మంది ఓట్లు ఎలా నమోదు అయ్యాయని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను భాగస్వాములను చేయవద్దని ఇంతకు ముందే ఆదేశాలు ఇచ్చినా బీఎల్ఓలు ఇంటింటి సర్వేకు వాలంటీర్లను తీసుకువెళ్లడంపైనా ప్రశ్నించారు. ఇటీవల కాలంలో ఎన్నికల సంఘానికి వచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నిస్తూ ఓటర్ల చేర్పులు, మార్పుల్లో పూర్తిగా నిబంధనలు పాటించాలని, బీఎల్ఓలకు పూర్తి స్థాయిలో ఆ అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. నియోజకవర్గాల పరిధిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచనలు ఇచ్చారు. బూత్, నియోజకవర్గ స్థాయిలో ఏ అధికారి ఓట్ల నమోదు ప్రక్రియ పరిశీలించి ఖరారు చేస్తారో వారే తప్పులు, లోపాలపై పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఎలాంటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
ఏపీ సర్కార్ కు హైకోర్టులో బిగ్ షాక్..ఆర్ – 5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలపై స్టే