YS Jagan: ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వోద్యోగులకు మధ్య దూరం పెరగనుందా.. అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై మొదట్లో సంఘీభావం ప్రకటించిన ఉద్యోగ సంఘాలు.. దీనిపై విడుదలైన జీఓ చూసి.. అవాక్కవుతున్నారు. పెంచిన పీఆర్సీ కంటే.. పాత జీతాలే బాగున్నాయనే భావం వారిలో వ్యక్తమవుతోంది. హెచ్ఆర్ఏ తగ్గింపు, సిటీ కాంపన్సేటరీ అలవెన్సు రద్దు, పెన్షనర్లకు అందే అదనపు మొత్తంలో వయో పరిమితి పెంచడం.. ఇవన్నీ వారికి రుచించట్లేదు. నిజానికి సీఎంతో భేటీ అనంతరమే ఉద్యోగ సంఘాలతో పెంచిన 23 శాతం పీఆర్సీపై ఉద్యోగులు విముఖత చూపించారు. ఇప్పుడు ఈ జీవోతో నిప్పు రాజుకున్నట్టేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నట్టు తెలుస్తోంది.
ఉద్యోగ సంఘాల మాట ఇదీ..
ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు స్పందిస్తూ.. ఇలాంటి పీఆర్సీని తన సర్వీస్లో చూడలేదని అంటున్నారు. కుడిచేత్తో ఇచ్చి ఎడం చేత్తో వసూలు చేస్తున్న చందంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికంటే పాత పీఆర్సీ, డిఏలను కొనసాగించడమే ఉత్తమమని అంటున్నారు. అశాస్త్రీయంగా ఇచ్చిన (YS Jagan) జీవోలను వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఇది చీకటిరోజు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదని అన్నారు. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తే వ్యతిరేక జీవోలు విడుదల చేశారని ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
కీలక నిర్ణయం తీసుకుంటారా..
దీంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచీ ఉద్యోగుల్లో ఉన్న భయాలే నిజమయ్యాయని చెప్పాలి. ప్రభుత్వం తెలివితేటలతో పాత డీఏలు ఇస్తూ.. నగదు కనిపించేలా చేసింది కానీ.. వాస్తవంలో ఉద్యోగులకు తత్వం బోధపడినట్టైంది. పీఆర్సీతో పెరగాల్సిన ఉద్యోగుల వేతనాలు వారికి కనిపించడం లేదు. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని.. అవసరమైతే సమ్మెకు దిగుతామని (YS Jagan) ఉద్యోగ సంఘాలు ప్రకటించడం పెద్ద ఉద్యమమే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులను మెప్పించాల్సిన ప్రభుత్వం ఇప్పుడు వారితో కయ్యమే పెట్టుకున్నట్టైంది. జరుగుతున్న పరిణామాలతో ప్రభుత్వంపై ఉద్యోగులకు దూరం పెరిగినట్టే. మరి.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.. పీఆర్సీపై పునరాలోచన చేస్తుందో.. వేచి చూడాల్సిందే..!