కూటమి పార్టీల్లో జోష్ పెరిగిందా? ఇక, క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు ఉన్న సందిగ్ధత, అనుమానాలు తొలగి పోయాయా? కలిసి పనిచేసేందుకు అందరూ కార్యోన్ముఖులు అవుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుడే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కలసి కట్టుగా జత కట్టాయి. సీట్లు పంచుకున్నాయి. ఇంత వరకు పై స్థాయిలో జరిగిపోయింది. అధినేతలు కూర్చుని చర్చించుకున్నారు. చేతులు కలుపుకొన్నారు.
కానీ, ఇక, కీలకమైన ఎన్నికల వేళ.. ఓట్లు కలవాలి. ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి పడాల్సి ఉంటుంది. ఇది క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకులు చేయాల్సిన పని. ఒకస్థానంలో టీడీపీ అభ్యర్థిని నిలబెడితే.. ఆ అభ్యర్థికి అనుకూలంగా బీజేపీ, జనసేన ఓట్లు కూడా పడాలి. అవి కూడా సైకిల్ గుర్తుకే పడాలి. లేకపోతే.. ఈ పొత్తు పెట్టుకుని కూడా ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని కాస్త లేటుగా గ్రహించిన పార్టీల అధినేతలు..క్షేత్రస్థాయి పై దృష్టి పెట్టారు.
ఎక్కడైతే.. కీలకమైన ఓటు బ్యాంకు ఉందో.. ఆ ప్రాంతాలు, నియోజకవర్గాలపై ప్రత్యకంగా సమాలోచనలు చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు కలసి పనిచేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే.. పైకి ఎన్ని చెప్పినా.. క్షేత్రస్థాయిలో నాయకులు కదులుతారో లేదో అన్న అనుమానం ఉండడంతో ఉమ్మడి సభల పేరుతో కలసి కట్టుగా నాయకులే.. కదనరంగంలోకి దిగారు. ఈ ఉమ్మడి సభలకు భారీగానే స్పందన లభిస్తోంది.
ఇప్పటి వరకు మూడు ఉమ్మడి సభలు నిర్వహించారు. ఇవన్నీ కూడా.. టీడీపీకి బలమైన జిల్లాలుగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలే కావడం గమనార్హం. అదేసయమంలో జనసేన, బీజేపీలకు కూడా ఈ జిల్లాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉంది. పైగా ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో సీట్లు కూడా 35 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి సభలకు ప్లాన్ చేసి.. వాటిని సక్సెస్ చేశారు. ఫలితంగా ఇప్పటి వరకు చేతులు కలుపుతారో లేదో అన్న బెంగ ఉన్న మూడు పార్టీల్లోనూ ఆశించిన మేరకు ఫలితం అయితే కనిపించింది. అయితే.. ఇది ఇక్కడితో అయిపోవడంకాకుండా.. రాబోయే 25 రోజుల్లో మరిన్ని ఉమ్మడి సభలు నిర్వహించడం ద్వారా ఈ జోష్ను కొనసాగించాలని అంటున్నారు పరిశీలకులు.