DR BR Ambedkar నేడు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 132 వ జయంతి. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతుంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సాగర తీరాన..125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతోంది. ఈ క్రమంలో నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పంచిన అపార మేధావి అంబేద్కర్ అని అభివర్ణించారు. ఎంతటి కష్టమైనా పనైనా చిత్తశుద్ధితో మరియు పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన జీవితం నేర్పిస్తుందని స్పష్టం చేశారు.
అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని ఎంతోమందికి అంబేద్కర్ మార్గదర్శకంగా నిలిచారని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో గొప్ప ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వ మానవుడు. దేశంలో సమాన హక్కుల కోసం పోరాడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు. సమాజంలో అన్నగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు ఆయన సమకూర్చినవే అని కొనియాడారు. ఇక ఈ విగ్రహం స్పెషాలిటీ చూస్తే విగ్రహం ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45 అడుగులు, బరువు 465 టన్నులు, వినియోగించిన ఉక్కు 353 టన్నులు, వినియోగించిన ఇత్తడి 112 టన్నులు, ఖర్చు ₹146.50 కోట్లు.. దేశంలోనే ఇదే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. విగ్రహావిష్కరణ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు.
ప్రధానంగా నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, లకిడికపూల్, తెలుగు తల్లి జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. దీంతో నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వైపు వాహనాలకు అనుమతి లేదు. విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం భారీ బహిరంగ సభ జరగనుంది. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ మనవడు.. ప్రకాష్ అంబేద్కర్ రాబోతున్నారు. 50 వేల మంది కూర్చునేలా విగ్రహ ప్రాంగణంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 11.80 ఎకరాల స్థలాన్ని దీని కోసం కేటాయించారు. విగ్రహం కింద ఉన్న పీఠంలో 27,556 చదరపు అడుగు స్థలం ఉంది. ఇందులో అంబేద్కర్ మ్యూజియం ఇంకా ఆయన జీవితానికి సంబంధించిన ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. హెలికాప్టర్ ద్వారా అంబేద్కర్ విగ్రహంపై పూల వర్షం కురిపించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.