Tirumala: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భారీ కానుకలను సమర్పించారు. సతీమణి సుధామూర్తి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిపి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేయించిన బంగరు కానుకలను ఆలయ ఇఓ ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారికి అబిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు గానూ బంగారంతో ప్రత్యేకంగా శంఖం, కూర్మ ఆకృతులను తయారు చేయించారు. ఈ స్వర్ణాభరాణాల విలువ సుమారు (రెండు కేజీలు) కోటి రూపాయల విలువ ఉంటుందని సమాచారం.
సుధామూర్తి ప్రస్తుతం టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. శ్రీవారిని సుధామూర్తి ఇష్టదైవంగా భావిస్తుంటారు. ప్రతి ఏటా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ఈ సందర్భంగా సుధామూర్తి మీడియాతో మాట్లాడుతూ తాను తొలిసారిగా 1953 లో తిరుమల కొండకు వచ్చాననీ, అప్పటి నుండి 70 ఏళ్లుగా తిరుమలకు వస్తున్నానని తెలిపారు. సుధామూర్తి సామాజిక సేవా కార్యక్రమాలతోనూ బిజీగా ఉంటారు.