Janasena: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఇవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమైయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి ఇటీవల ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పంచకర్ల తన అనుచరులతో మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకుని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. తన అనుచరులను పవన్ కళ్యాణ్ కి పరిచయం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
సమావేశం అనంతరం పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తపన చూసి తాను కూడా ఒక సైనికుడిలా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నానీ, ఇదే విషయం ఆయనతో చెప్పానన్నారు. ఈ నెల 20వ తేదీన తన అనుచరులతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు. పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తాననీ, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తానని తెలిపారు.
ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పంచకర్ల రమేష్ బాబు 2009 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన సందర్భంగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాస్ రావు, అవంతి శ్రీనివాస్ తదితరులతో కలిసి పంచకర్ల టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఆ తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో యలమంచిలి నుండి రెండో సారి పోటీ చేసినా వైసీపీ గాలిలో ఓటమి పాలైయ్యారు.
విశాఖ రూరల్ లో ఒక్క స్థానం కూడా టీడీపీ గెలవకపోవడంతో నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. ఆ తర్వాత కొద్ది నెలలు సైలెంట్ గా ఉన్న పంచకర్ల 2020 ఆగస్టు నెలలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆశిస్తూ అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అయితే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకే టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనిపిస్తుండటంతో పాటు పంచకచర్ల జనసేనకు వెళ్లే నాయకుడే అని ప్రచారం కూడా చేయడంతో ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం తన అనుచరులతో సమావేశం నిర్వహించారు.
జనసేన పార్టీలో చేరనున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. పంచకర్ల అనుచరులు అందరూ ఆయన నిర్ణయానికి మద్దతు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పంచకర్ల మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేరికపై చర్చించగా, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు (స్వాములు) తన అనుచరులతో కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీలో చేరారు. భారీ కార్ల ర్యాలీతో మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆమంచి స్వాములుకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
NCP: ఇదేమి రాజకీయం సామీ..’మహా’లో బిగ్ ట్విస్ట్