AP TS: రాష్ట్రాలుగా విడిపోయి ఏపీ, తెలంగాణ అన్నదమ్ములుగా ఉంటారని భావించారు అంతా. కానీ.. ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల పోట్లాటలానే తయారైంది పరిస్థితి. రాష్ట్రాలుగా విడిపోయి దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తోంది. కానీ.. రెండు రాష్ట్రాల మధ్య తీరని తగవులు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రముఖమైంది నీటి వాటాలు, ప్రాజెక్టులు. నీటి సమస్య ఒక్క తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఉన్నదే. అయితే.. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలే అన్నదమ్ములుగా ప్రాంత ప్రయోజనాలు చూసుకుని పంపకాలు చేసుకోవాల్సింది పోయి.. అంత కుదరదు, ఇలా తగదు, అలా అయితే ఒప్పుకునేది లేదు.. అంటూ జగడాలు పెట్టుకుంటున్నాయే కానీ.. పంచయతీ చేసుకోవట్లేదు. కృష్ణా, గోదావరి నదులు రెండింటిపైనా రెండు రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి.
గోదావరి-కృష్ణాపై..
గోదావరికి సంబంధించి తెలంగాణ నీటి వినియోగంపై కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై కూడా నివేదిక ఇచ్చింది. అయితే.. ఏపీ సమర్పించిన వివరాల్లో తేడాలున్నాయని కేంద్ర జల సంఘం పేర్కొంది. ప్రస్తుతం వినియోగంతోపాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ చూపిన తేడాలకు ఆధారాలు చూపాలని సూచిస్తూ (AP TS) ఏపీకి లేఖ రాసింది. దీంతో సమస్య ఒక అడుగు ముందుకేస్తే.. పది అడుగులు వెనక్కు అనే చందాన సాగుతోంది. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీకి సమాధానం ఇస్తూ.. అంతర్రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించే అనుమతులు ఇచ్చామని పేర్కొంది. ఇలా సమస్యలను ఇరు రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉండే పంచాయతీ మాత్రం కేంద్ర జల సంఘం చేయడం లేదనే చెప్పాలి.
పంచాయతీ తేలేనా..
టీడీపీ-టీఆర్ఎస్ హయాంలో నీటి పంచాయతీ తేలలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కావడంతో లెక్కలు, నీటి వినియోగం పంచాయతీ తేలలేదు. ప్రస్తుత (AP TS) వైసీపీ-టీఆర్ఎస్ హాయాంలో అయినా నీటి పంచాయతీ ఓ కొలిక్కి వస్తుందంటే నీలినీడలే కమ్ముకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో ఎడమ గట్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఏపీ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నీటి పంపకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకూ ఆమోదయోగ్యమయ్యే పరిష్కారం లభిస్తుందా అనేది ప్రశ్న..!