ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ సంఖ్యలో విచ్చేసిన పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి చంద్రబాబు వారిని ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. వైసీపీ సర్కార్ పని తీరు, సీఎం జగన్మోహనరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదే క్రమంలో వివేకా హత్య కేసు దర్యాప్తు గురించి మాట్లాడారు. తనను తక్కువ అంచనా వేయవద్దని, తాను సింహం, కొదమ సింహంలా విరుచుపడతానంటూ వ్యాఖ్యానించారు.
దీంతో వైసీపీ కీలక నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవేళ మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు మాటలను తీవ్రంగా ఖండించారు. పులివెందులకు, రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబు అధికారంలో ఉండగా చేసింది ఏమీ లేదని అన్నారు. సింహం, సింహం ఆని ఆయన చెప్పుకోవడం కాదు, ఆయన సింహమో.. లేక గ్రామ సింహమో నిర్ణయించేది ప్రజలని సెటైర్ వేశారు. రాజకీయాల్లో ధైర్యం లేని వాళ్లే అలా చెప్పుకుంటారని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు మాటలు అన్నీ పచ్చి అబద్దాలేనని అన్నారు. ఏది మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారు అన్న ధోరణిలోనే చంద్రబాబు పులివెందులలో ప్రసంగించారన్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందని అన్నారు. ముందుగా ఆయన పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులకు ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి భూమిపూజ చేశారు.
ఏపీలో ఎన్నికల ప్రక్రియ షురూ.. 175 నియోజకవర్గాలకు ఆర్ఓల నియామకం