YSRCP: విశాఖ వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవి నుండి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తప్పుకున్నారు. ఈ మేరకు వాసుపల్లి గణేష్ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డికి, నగర అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్ కు లేఖ రాశారు. ఈ లేఖలో వాసుపల్లి గణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తనకు బలనిరూపణ పెట్టడం తన గౌరవానికి భంగం కలిగించిందని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుండి తప్పుకుంటున్నట్లుగా లేఖలో పేర్కొన్నప్పటికీ అసలు కారణం వేరే ఉన్నట్లుగా సమాచారం. వాసుపల్లి గణేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికే చెందిన సీతంరాజు సుధాకర్ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. సీతంరాజుతో ఉన్న విభేదాల కారణంగానే వాసుపల్లి గణేష్ నియోజకవర్గ ఇన్ చార్జి పదవికి రాజీనామా చేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మత్సకార బీసీ వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ విద్యావేత్తగా పేరు ఉంది. 2009 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో వాసుపల్లి గణేష్ వైసీపీకి దగ్గర అయ్యారు. ఆయన కుమారులను వైసీపీలో చేర్పించి ఆ పార్టీ మద్దతు ఎమ్మెల్యేగా మారిపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆయన నియోజకవర్గ సమన్వయకర్త పదవిని కట్టబెట్టారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పార్టీ అధిష్టానం ఆయన రాజీనామాను ఆమోదిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.