తన తల్లికి అనారోగ్యంతో ఉన్నారంటూ సీబీఐ విచారణకు డుమ్మా కొట్టిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుండి పులివెందులకు బయలుదేరిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి విచారణకు హజరు కాకుండా పులివెందులకు బయలుదేరిన విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు హైదరాబాద్ నుండి ఆయనను అనుసరించారు. అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తొలుత పులివెందులలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
లక్ష్మమ్మ వయస్సు, ఆరోగ్య పరిస్థితి దష్ట్యా మరింత మెరుగైన వైద్య సేవలు అవసమని అక్కడి వైద్యులు సూచించడంతో పులివెందుల నుండి హైదరాబాద్ బయలుదేరారు. అయితే విపరీతమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలో లక్ష్మమ్మను మరింత దూరం ప్రయాణించడం సరికాదని భావించి మార్గమధ్యంలోని కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి పులివెందులకు బయలుదేరిన అవినాష్ రెడ్డి తల్లిని తీసుకువస్తున్న అంబులెన్స్ తో కలిసి కర్నూలుకు వెళ్లారు. కాగా అవినాష్ రెడ్డిని అనుసరిస్తూ వెళ్లిన సీబీఐ అధికారులు కర్నూలు నుండి వెనుతిరిగినట్లు సమాచారం.
కాగా ఇవేళ ఉదయం సీబీఐ కార్యాలయం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అవినాష్ రెడ్డి విచారణకు హజరు అవుతారన్న సమాచారంతో కోటి సీబీఐ కార్యాలయం వద్దకు అవినాష్ అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 గంటలకు అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉండగా చివరి నిమిషంలో తన షెడ్యుల్ ను మార్చుకున్నారు. తన తల్లి అస్వస్థతకు గురైయ్యారని సమాచారం రావడంతో సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చి పులివెందులకు బయలుదేరారు. అవినాష్ రెడ్డి ఈ నెల 16వ తేదీన, తర్వాత ఇవేళ విచారణకు వివిధ కారణాలతో గైర్హజరు కావడం పై సీబీఐ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.