Nimmagadda : ఏపిలో వైసీపీ ప్రభుత్వ అభీష్టానికి భిన్నంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమై జరుగుతున్నా ఫలితాలు మాత్రం వైసీపీకి అనుకూలంగా వస్తుందటంతో ఆ పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుమార్ టీడీపీకి అనుకూలం అని, చంద్రబాబు జేబులో మనిషి అని పలువురు మంత్రులు, వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే అధికార పక్షానికి ఎస్ఈసీ వ్యతిరేకమని ప్రచారం జరిగినా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తరువాత వైసీపీకి వ్యతిరేకంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించినట్లు కనబడలేదని అంటున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపైనా అంతగా స్పందించన దాఖలాలు లేవు. ప్రతిపక్షం ఏమనుకున్నా, అధికార పక్షం ఎమన్నా పట్టించుకోకుండా తనకు ఉన్న రెండు నెలల వ్యవధిలో ఎన్నికలు ఆన్నీ సక్రమంగా పూర్తి చేసి పదవీ విరమణ చేయాలన్న ఆలోచనలోనే నిమ్మగడ్డ ఉన్నట్లు కనబడుతోంది.
అందుకే తొలి విడత ఏకగ్రీవం అయిన పంచాయతీల విషయంలో చిత్తూరు, గుంటూరు జిల్లాల జాబితాను తొలుత వెల్లడించవద్దు, హోల్డ్ లో పెట్టమని ఆదేశాలు ఇచ్చినా ఆ తరువాత అన్నింటినికీ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఓకే చెప్పేశారు. అభ్యర్థులను బెదిరింపులకు గురి చేసి నామినేషన్ లను ఉపసంహరింపజేస్తూ ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని టీడీపీ ఫిర్యాదు చేసినా ఎస్ఈసీ లైట్ తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్ఈసీపై అధికార పక్ష నేతల విమర్శల దాడి తగ్గిపోయింది. అయితే తాజాగా ఎస్ఈసీపై టీడీపీ ఫైర్ అవుతోంది. రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహణలో, శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తి సహాయ సహకారాలు అందించడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్ లను ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్పూర్తితో మిగిలిన మూడు దశ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రశాంతంగా, సక్రమంగా ఎన్నికలు జరిగిపోతున్నాయని వీరు సంతోషం వ్యక్తం చేస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎస్ఈసీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Nimmagadda : ఎస్ఈసీపై చంద్రబాబు ఫైర్
ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్ఈసీ పూర్తిగా విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. అడ్డగోలుగా నామినేషన్ లు తిరస్కరించి ఏకగ్రీవాలు చేసుకుంటున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదంటూ దుయ్యబట్టారు. ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ మద్దతుదారులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పుంగనూరు, రొంపిచర్ల, సోమల, చౌడేపల్లి తదితర ప్రాంతాల్లో నామినేషన్లు పెద్ద ఎత్తున తిరస్కరించారని అన్నారు. ఎన్నికలు సక్రమ నిర్వహణలో ఎస్ఈసీ విఫలమైనందు వల్లనే హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రే ఎన్నికలను అపహస్యం చేశారనీ, అధికారులను బెదిరించిన మంత్రి పెద్దిరెడ్డిని తక్షణమే బర్తరఫర్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల దుస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నామనీ, అదే విధంగా రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా వివరాలు పంపుతామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పరిణామాలు చూస్తున్న వారు చంద్రబాబుతో నిమ్మగడ్డకు చెండిందని వ్యాఖ్యానిస్తున్నారు.