Nimmagadda : రాష్ట్రంలో ఎస్ఈసీ SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైఎస్ జగన్ YS Jagan ప్రభుత్వం మధ్య వివాదం తారా స్థాయికి చేరిన విషయం అందరికీ తెలిసిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు తరచు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై బాహాటంగా విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే నిమ్మగడ్డ మాత్రం సైలెంట్ గా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. నిమ్మగడ్డ లోని ఆంతర్యం హైకోర్టు న్యాయమూర్తి కూడా గ్రహించినట్లు ఉన్నారు. అందుకే ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు ఉన్నారు. అసలు ఎస్ఈసీ ఉద్దేశం ఏమిటంటూ హైకోర్టు న్యాయమూర్తి నిలదీయడం అందరిన ఆశ్చర్యానికి గురి చేసింది. కోర్టు దిక్కార పిటిషన్ ను ప్రచారం కోసం దాఖలు చేస్తున్నారా అంటూ హైకోర్టు సోమవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నిలదీసింది. గత నెల 18వ తేదీన కోర్టు దిక్కార పిటిషన్ 42 రోజుల పాటు ధర్మాసనం ముందు విచారణకు రాలేదనీ అయితే పిటిషన్ లో ప్రతి అక్షరం మాత్రం ఆ మరుసటి రోజు అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైందని దీంతో పిటిషన్ వేసిన ప్రయోజనం నెరవేరినట్లు కమిషనర్ భావించినట్లు ఉన్నారని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అసలు వివరాల్లోకి వెళితే..ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడం లేదనీ, నిధులు విడుదల చేసేలా అదేశాలు ఇవ్వడంతో పాటు ఆర్థిక, ఆర్థికేతర సహాయ సహకారాలు అందించేలా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ గత ఏడాది ఎస్ఈసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రభుత్వం ఎస్ఈసీకి అన్ని విధాలుగా సహయ సహకారాలు అందించాలంటూ గత ఏడాది నవంబర్ మూడవ తేదీన ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదని దీనిని కోర్టు దిక్కారంగా పరిగణించాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత ఏడాది డిసెంబర్ 18న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గత నెల 29న విచారణకు వచ్చింది.
అందులో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను ప్రతివాదిగా చేసేందుకు కమిషన్ తరపు న్యాయవాది గడువు కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ పిటిషన్ విచారణకు రాగా న్యాయమూర్తి తనకు కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాలని ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ ను ఆదేశించారు. డిసెంబర్ 18న పిటిషన్ వేస్తే అది జనవరి 29వ తేదీ వరకూ ఎందుకు విచారణకు రాలేదు. ఇన్నిరోజుల జాప్యం మీ తప్పా, రిజిస్ట్రీ తప్పా అని ప్రశ్నించారు. కేసు విచారణకు వచ్చేందుకు రిజిస్ట్రీకి లేఖలు రాశామనీ, ఫోన్లు కూడా చేశాననీ న్యాయవాది అశ్వనీకుమార్ సమాధానమిచ్చారు.
Nimmagadda : 42 రోజులు సైలెంట్ గా ఎందుకు ఉన్నారు ?
అత్యవసరం లేదని బావించే 42 రోజుల పాటు సైలెంట్ గా ఉన్నారా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. నిజంగా అత్యవసరమని భావిస్తే ఈ కోర్టులో ప్రస్తావించి ఉండేవారని ఆ పని చేయలేదంటే ఎస్ఈసీ ఏ ప్రయోజనం ఆశించి కోర్టు దిక్కార పిటిషన్ దాఖలు చేశారో అర్థం అవుతోందన్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తరువాత దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరుతున్నారంటేనే ప్రతిపాదుల పై ఒత్తిడి పెంచడానికి ఇలా చేస్తున్నారని ఈ కోర్టు అభిప్రాయపడుతుందన్నారు. ఇన్ని రోజులు ఓ పిటిషన్ విచారణకు రాకపోవడం అంటే ఈ కోర్టు రాజ్యాంగ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడమేనని న్యాయమూర్తి అన్నారు. అందుకు బాధ్యులైన అధికారులపైనా కోర్టు దిక్కార చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అదే విధంగా కోర్టు దిక్కార పిటిషన్ లో ప్రతివాదులుగా ఉన్న అప్పటి సీఎస్ నీలం సాహ్ని, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది లకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. పిటిషన్ విచారణకు రాకముందే వాటిని పత్రికలకు ఇవ్వడం సరికాదనీ, ఈ విషయంలో కమిషనర్ కు తగిన సలహా ఇవ్వాలని కూడా కమిషన్ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ కు న్యాయమూర్తి సూచించారు.