TIRUPATI BYPOLL : తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని బలంగా కనిపిస్తుంది వైఎస్ఆర్సిపి గెలుపు మీద ఇప్పుడు పెద్దగా ఆందోళన పడటం లేదు. కేవలం తమ అభ్యర్థికి గత ఎన్నికల కంటే ఎంత మెజారిటీ పెరుగుతుంది అని లెక్కలు మాత్రమే నాయకులు వేస్తున్నారు. మెజారిటీ పెరగాలంటే కచ్చితంగా ఓటింగ్ శాతం పెంచాలి అనే కాన్సెప్ట్ తో ఇప్పుడు తిరుపతి లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ సీపీ నేతలు పనిచేస్తున్నారు.
TIRUPATI BYPOLL ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలి
తిరుపతి లోక్సభ సీటు తాము గెలుస్తామని టిడిపి ఇటు బీజేపీ చెబుతున్నా, అటు వైపు మాత్రం ఇప్పటికే విజయం ఖాయం అయినట్లే కనిపిస్తోంది. అధికార పార్టీ విజయం మీద పెద్ద భయాలు ఆందోళనలు పెట్టుకోలేదు. 2019 ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్ కు 2, 28, 376 ఓట్ల మెజారిటీ వస్తే, దానిని కచ్చితంగా 5 లక్షలకు పెంచాలని అన్నది ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన టార్గెట్. ఇప్పుడు దాని కోసమే నేతలంతా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే లోక్ సభ ఆనం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు విడివిడిగా మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించిన సీఎం, ఆయా నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెంచడం మీద దృష్టి పెట్టాలని సూచించారు.
నాయకులు సైతం ఓటింగ్ శాతం భారీగా పెరిగితేనే ముఖ్యమంత్రి నిర్దేశించిన మెజారిటీ లక్ష్యం సాధించవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అసలే ఉపఎన్నికలు వేళ, అందులోనూ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపరు. దీంతో 2019 లో నమోదైన పోలింగ్ శాతం కంటే తగ్గితే దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలి అన్న దానిమీద నాయకులు దృష్టి పెడుతున్నారు. టీడీపీకి 2019లో 4,94,501 ఓట్లు వచ్చాయి. అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చినా, లేక అదే ఓట్లను టిడిపి సాధించినా వైసిపి నైతికంగా ఓడిపోయినట్లే. 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని 77.04 శాతం ఓటింగ్ నమోదు అయితే, 2019 ఎన్నికల్లో 79.76 శాతం మేరకు ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు దీని కంటే ఎక్కువగా ఓటింగ్ ను ఎలా పెంచాలి అన్నదే అధికార పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చ.
అధికార పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిన ఎస్సీ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకుల సహాయం తీసుకోవాలని, కిందిస్థాయి కార్యకర్తల కు ప్రాధాన్యం ఇచ్చి వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు చూస్తున్న నాయకులు భావిస్తున్నారు. దీంతోపాటు కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకునేలా కార్యకర్తల ద్వారా ప్రచారం నిర్వహించాలని, అందరినీ దగ్గరుండి ఓటు వేయించి బాధ్యతను కిందిస్థాయి కార్యకర్తల వరకు తీసుకెళ్తే మంచి ఫలితం ఉంటుంది అన్నది నేతల అంచనా. దీనికి తగినట్లుగానే ఈసారి కచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల్లో 80% దాటి పోలింగ్ నమోదు అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి వీలు ఉంటుందని భావిస్తున్నారు.
అన్నీ మంచి శకునములే!
అధికార పార్టీ కు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడానికి అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా వచ్చిన మెజారిటీ ప్రాణాలతో అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు మంచి జోష్ మీద కనిపిస్తున్నారు. మరోపక్క ప్రతిపక్షం టిడిపి బలం అనూహ్యంగా తగ్గడం, మరోపక్క బీజేపీ-జనసేన మైత్రి మీద ఆ పార్టీ నేతలకే నమ్మకం లేకపోవడం తో టిడిపి బిజెపి రెండు పార్టీలకు కనీస ఓట్లు, డిపాజిట్లు వస్తాయా అన్నదే చర్చలో ఉంది. మరోపక్క అధికారపార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకు వెళ్లడం, అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సిపి కు బలమైన క్యాడర్ ఉండడం మరో సానుకూల అంశం. దీంతో ముఖ్యమంత్రి పెట్టిన టార్గెట్ ఎక్కడ మిస్ కాకూడదు అన్నది కిందిస్థాయి కార్యకర్తలు లోనూ వినిపిస్తున్న మాట.